కరీంనగర్లో ఈసీఎల్ఏటీ హెల్త్ కేర్ సెంటర్: కేటీఆర్ అమెరికా పర్యటనలో ఒప్పందం
హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అక్కడి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. తాజాగా, హెల్త్ కేర్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన 3ఎం హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(హెచ్ఐఎస్), ఈసీఎల్ఏటీ హెల్త్ సోల్యూషన్స్(ECLAT Health Solution) సంయుక్తంగా తెలంగాణలోని కరీంనగర్లో కొత్త సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో 3ఎం, ఈసీఎల్ఏటీ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంతో ఆ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఆ సెంటర్ మెడికల్ కోడింగ్, క్లినికల్ డాక్యుమెంటేషన్ సేవల్ని అందించనుంంది. కరీంనగర్లో ఏర్పాటు చేయనున్న ఈసీఎల్ఏటీ ఆపరేషన్స్ సెంటర్లో వంద మందికి ఉద్యోగం కల్పించనున్నారు. ఆ తర్వాత ఆ సెంటర్లో ఉద్యోగుల సంఖ్యను 200కు పెంచనున్నట్లు పేర్కొన్నారు.

ఈసీఎల్ఏటీ హెల్త్కేర్ సంస్థతో కుదిరిన ఒప్పందం గురించి మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. సుమారు 40 ఏళ్ల నుంచి 3ఎం హెచ్ఐఎస్ హెల్త్కేర్ రంగంలో సేవలు అందిస్తోంది. ఆ సంస్థ అత్యాధునిక హెల్త్కేర్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దాదాపు 18 దేశాల్లో ఆ సంస్థ సేవలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందిచడమే లక్ష్యంగా ఆ సంస్థ సేవలు అందిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, 3ఎంతో పాటు ఈసీఎల్ఏటీ మధ్య సహకారం గురించి సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
3M Health Information Systems (HIS), a world-renowned leader in healthcare transformation and ECLAT Health Solutions, a leading provider in healthcare support services have signed an agreement allowing ECLAT to provide medical coding and clinical documentation services to 3M… pic.twitter.com/nefKqpviKY
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2023
కరీంనగర్ సెంటర్ ద్వారా మెడికల్ కోడింగ్, సంబంధిత టెక్నాలజీ సేవల గురించి పనిచేయనున్నట్లు ఈసీఎల్ఏటీ హెల్త్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు, గ్రూపు సీఈవో కార్తీక్ తెలిపారు. 3ఎంతో భాగస్వామ్యం ఏర్పడటం సంతోషకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వ విజన్ తమను ఆకర్షిస్తున్నట్లు 3ఎం హెచ్ఐఎస్ ఎండీ సందీప్ వాద్వా తెలిపారు.
ఈ ఒప్పందంతో తెలంగాణలో లైఫ్సైన్సెస్, హెల్త్కేర్ను ప్రమోట్ చేయనున్నట్లు వివరించారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ లాంటి సంస్థలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తోపాటు మెడ్ ట్రానిక్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మెడ్ ట్రానిక్ 3వేల కోట్ల పెట్టుబడులను పెట్టనుంది.












Click it and Unblock the Notifications