రోడ్ల మీద కొట్లాడాం, మా నోరు ఇంతే: కెటిఆర్, రాజకీయాలు వదిలేస్తా..
అదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇంకా మాకు పదవులు ఒంటబట్టలేదని, రోడ్ల మీద కొట్లాడటమే తెలిసిన వాళ్లమని వ్యాఖ్యానించారు.
ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. మంత్రులు నోళ్లు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అంటున్నారని, కానీ మేం నిన్నటిదాకా ఉద్యమకారులమని, మా నోరు ఇలాగే ఉంటుందన్నారు. ఉద్యమంలో నీలాంటి వాళ్లను చాలా చూశామని చెప్పారు. ప్రజల వైపు ఉండకుంటే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారని హెచ్చరించారు.
తాము అధికారంలోకి వచ్చి పదహారు నెలలే అవుతోందని, అందుకే తమకు పదవులు ఒంటబట్టలేదని, తమ నోళ్లు ఇలాగే ఉంటాయని చెప్పారు. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నల్గొండలో లక్షలాది మంది ఫ్లోరోసిస్తో బాధపడుతుంటే ఎందుకు మాట్లాడలేదన్నారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం జలహారం పేరుతో తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. కిరణ్ హయాంలో ఏడువేల కోట్ల రూపాయలు తన జిల్లాకు కిరణ్ నీటి కోసం అని మంజూరు చేయించుకున్నారని, మరి తెలంగాణలోని పది జిల్లాల కోసం ఎంత మొత్తం కావాలో చెప్పాలని ప్రశ్నించారు.
వాటర్ గ్రిడ్ బాగోతం బయటపెడతామని ఓ కాంగ్రెస్ నేత చెబుతున్నారని, పెట్టుకోవచ్చునని చెప్పారు. వాటర్ గ్రిడ్ రుజవు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కెటిఆర్ సవాల్ చేశారు. మేం కాంగ్రెస్ నేతల లెక్క తప్పుడు పనులు చేయమన్నారు.
ప్రజల కోసం పైపులైన్లు తప్పితే, మీలా కాంట్రాక్టర్ల కోసం పైప్ లైన్లు వేసే దరిద్రపు పనులు చేయమన్నారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం దెబ్బలు తిన్నది టిఆర్ఎస్ నేతలు అని, కలిసింది ప్రజలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదని, ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
1969లో విద్యార్థులను చంపింది ఎవరని, 2004 నుంచి పదేళ్ల పాటు చావులకు కారణం ఎవరని నిలదీశారు. వచ్చే ఐదేళ్లలో ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓటు అడగమని చెప్పామన్నారు. మూడేళ్లలో జలహారం (వాటర్ గ్రిడ్) పూర్తి చేస్తామని చెప్పారు. ఇది భగీరథ ప్రయత్నం అన్నారు.
తెలంగాణ కోసం టిఆర్ఎస్ నేతలు జైళ్లకు వెళ్తే, కాంగ్రెస్ నేతలు పదవులు పట్టుకొని వేళ్లాడారన్నారు. తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని హెచ్చరించిన కిరణ్ కుమార్ రాజకీయ జీవితం చీకటి అయిందన్నారు. సిద్దిపేట స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా వాటర్ గ్రిడ్ అన్నారు.
నిన్నటి దాకా అధికారంలో ఉన్నవాళ్లు ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. వారు అరవై ఏళ్లలే చేయలేదని, మేం కచ్చితంగా అరవై నెలల్లో చేస్తామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు భరోసా ఇచ్చి ఉంటే నేడు భరోసా యాత్రలు చేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
వచ్చే ఎండకాలం నుంచి పగటిపూట 9 గంటల కరెంట్ ఇస్తామన్నారు. గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మిస్తామన్నారు. ఎంతమంది కారుకూతలు కూసినా రైతులను అధైర్యపడొద్దన్నారు. కాంగ్రెస్ నేతలు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు.
ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలమన్నారు. వాటర్ గ్రిడ్కు రూ. 35 వేల కోట్లు మనం ఖర్చు పెడుతుంటే కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదన్నారు. వాటర్ గ్రిడ్ కోసం ఇప్పటికే ప్రముఖ సంస్థలు రూ. 20 వేల కోట్లు రుణాలు ఇచ్చాయన్నారు.
2050 ఏడాది వరకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటర్ గ్రిడ్ను డిజైన్ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 25 వేల కిలోమీటర్ల మేర్ల పైపు లైన్లు వేయాలని, 50 నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటికి రోజుకు 100 లీటర్ల నీరు అందివ్వాలన్నారు.
మంత్రి కేటీఆర్, డిప్యూటీ సీఎం మహముద్ అలీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నిర్మల్ మండలం వెల్మల్ వద్ద వాటర్ గ్రిడ్ ఇన్టెక్ వెల్ పనులను మహముద్ అలీ, మంత్రి పరిశీలించారు. దివాలపూర్ మండలం మోడేగాంలో వాటర్గ్రిడ్ పైలాన్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.