ఎన్నికలకు సిద్దం కండి -పీకే సర్వేనే టిక్కెట్లకు ఆధారం : త్వరలో జాతీయ పార్టీ - కేటీఆర్..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పై ప్రకటన దిశగా అడుగులు వేస్తున్న వేళ..మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. భారత్ రాష్ట్రీయ సమితి(బీఆర్ఎస్) ఏర్పా టు చేస్తున్నామని, త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని వెల్లడించారు. బీఆర్ఎస్ కోర్ కమిటీ మీటింగ్కు సంబం ధించి ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు కూడా ఆహ్వానాలు అందుతాయని చెప్పారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల వేళ కేటీఆర్ పార్టీ నేతలను ఎన్నికలకు సిద్దం కండి అంటూ పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు స్పష్టం చేసారు.

సిట్టింగ్ లు భ్రమల్లో ఉండొద్దు
ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. ప్రస్తుత సిట్టింగ్లకే మళ్లీ సీట్టు వస్తాయనే భ్రమలో ఉండొద్దంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సిట్టింగ్లు, మాజీలు అంతా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. సిట్టింగ్లకే సీట్లు వస్తాయనే భ్రమలో ఉండొద్దు... ఎవరికైనా టికెట రావొచ్చంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలలో కీలకంగా మారబోతున్నామని చెప్పారు. జనహితమే ఆశీర్వాదం కావాలని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇంకా బలంగా ప్రజలలోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్లను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

పీకే సర్వే నివేదికలే ఆధారం
అనవసర విషయాలకు మీడియాకి ఎక్కొద్దంటూ స్పష్టం చేసారు. కొంత కాలంగా జిల్లా పార్టీ నేతల మధ్య ఉన్న పొరపొచ్చాలపైనా కేటీఆర్ దృష్టి సారించారు. జిల్లా పార్టీలోని విభేదాలపై ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన నేతలు, జెడ్పీ చైర్మన్లతో ప్రత్యేకంగా చర్చించారు. పనితీరు ఆధారంగానే టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు. సర్వే నివేదికలను ప్రామణికంగా తీసుకుంటామని స్పష్టం చేసారు. కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. పని తీరు మెరుగుపరుచుకోవాలని తేల్చేసారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందేనంటూ కేటీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేసారు. గతంలో రెండుసార్లు జిల్లాలో చేదు ఫలి తాలు వచ్చాయని, ఈసారి అవి పునరావృతం కావొద్దని, పదికి పది స్థానాలను సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు

ఎన్నికలకు సిద్దం కావాలి
అధికార యంత్రాంగాన్ని సొంత పనులకు వినియోగించుకోవద్దని దీని కారణంగా ప్రజల్లో ఏహ్య భావన వస్తుందని పేర్కొన్నారు. పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తింటుందని హెచ్చరించారు. సీనియర్లను వదులుకోవటానికి సిద్దంగా లేమని.. వారి సేవలు పార్టీకి అవసరమని కేటీఆర్ స్పష్టంగా చెప్పుకొచ్చారు. అటు కేసీఆర్ జాతీయ పార్టీ ..ఇటు కేటీఆర్ జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దటం మొదలు పెట్టటం..ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండమని చెప్పటంతో..ఇప్పుడు ప్రతిపక్షాలతో పాటుగా గులాబీ పార్టీలోనూ చర్చకు కారణమైంది. రానున్న రోజుల్లో రాజకీయంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications