ఎపికి నీరూమట్టీ అయినా ఇచ్చారు, టీ ముఖమే చూడలేదు: మోడీపై కెటిఆర్ రుసరుస
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని మూడు సార్లు ఆహ్వానించామని, అయినా రాష్ట్రానికి రాలేదని తెలంగాణ ఐటి శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కెటి రామారావు అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని సర్వేలో తేలిందని ఆయన శుక్రవారంనాడు అన్నారు. ఆంధ్రప్రదేశ్కు మోడీ నీరు, మట్టి అయినా ఇచ్చారని, కనీసం తెలంగాణ ముఖం కూడా చూడలేదని ఆయన అన్నారు.
రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని ఆయన అడిగారు. తాము హైదరాబాదులోని 150 స్థానాలకు పోటీ చేస్తామని, కచ్చితంగా 80 డివిజిన్లు గెలుచుకుంటామని ఆయన చెప్పారు. కెసిఆర్ పాలనపై రోజురోజుకూ సానుకూల వాతావరణం పెరుగుతోందని, హైదరాబాద్లో ఫీల్ గుడ్ వాతావరణం ఏర్పడిందని ఆయన చెప్పారు. గత 18 నెలల కాలంలో ఏ విధమైన బావోద్వేగాలు లేకుండా సీమాంధ్ర ప్రజలు కూడా అంగీకరిస్తున్నారని ఆయన చెప్పారు.
రోజు రోజుకూ టిఆర్ఎస్ బలం పెరుగుతోందని, కెసిఆర్ పాలనపై విశ్వాసం పెరుగుతోందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ హైదరాబాదులోని సీమాంధ్రుల ఓటర్లను నమ్ముకుందని, హైదరాబాదులో ఉంటున్న సీమాంధ్రులకు ఎపి ప్రభుత్వం రుణమాఫీ చేయడం లేదని చెబుతూ అలాంటప్పుడు హైదరాబాదులోని సీమాంధ్రులు టిడిపి ఎలా ఓటేస్తారని ఆయన అడిగారు.
కాంగ్రెసుకు సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావని ఆయన అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. వార్డుల విభజన హేతుబద్దంగా జరుగుతుందని ఆయన చెప్పారు.