కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ ఘటన పైన సీరియస్ గా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. గంగారెడ్డిని దారుణంగా హత్య చేయడంతో రాష్ట్రంలోని శాంతిభద్రతల పైన తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల ధర్మపురి రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.
జీవన్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్ వ్యాఖ్యలు
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీకు మీ పార్టీకి ఓ దండం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఘటన పైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

గత కొన్ని నెలలుగా జనం ఆందోళన ఈ రోజు జీవన్ రెడ్డిది
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చెబుతున్న మాటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కొన్ని నెలల నుంచి జనం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారని రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఇక ఈరోజు అదే ఆవేదన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా వ్యక్తం చేశారన్నారు.
హోం మినిస్టర్ లేని రాష్ట్రంలో ఈ దారుణాలు
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఫుల్ టైం హోమ్ మినిస్టర్ లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని, అందుకే ఇలా పరిస్థితులు మారాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా పోలీసులు రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉండడంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కుంటుపడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వారికి స్వేచ్చనిస్తే శాంతి భద్రతల పరిరక్షణ
ఇప్పటికైనా పొలిటికల్ బాసులలో వివేకం ప్రబలుతుందని ఆశిస్తున్నామని, మన రాష్ట్రంలోని సమర్థవంతులైన పోలీస్ అధికారులు శాంతిభద్రతల పరిరక్షణకు సమయాన్ని కేటాయిస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు. పోలీసులు తమ ప్రాథమిక కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి దృష్టి సారిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. పోలీస్ ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వారి పని వారిని చేసుకోనిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ చేయడంతో పాటు సామరస్యాన్ని కాపాడగలుగుతారని మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం
జీవన్ రెడ్డి అనుచరుడి హత్య నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. గత పది నెలలుగా హోం మంత్రి లేకపోవడం వలన రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో హత్యలు, అత్యాచారాలు, దాడులు కొనసాగుతున్నాయని, ఏ వర్గం ప్రశాంతంగా జీవించింది లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications