హరీష్ రావు ఏం చేశారో గుర్తు లేదా, అదెలా తప్పు?: కుంతియా
న్యూఢిల్లీ: తమ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు, సస్పెన్లపై కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా స్పందించారు.ఆ చర్యను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను రద్దు చేయడం అప్రజాస్వామికమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో హరీష్ రావు వ్యవహరించిన తీరు గుర్తు లేదా అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు వెల్లోకి వెళ్తున్నారని, అటువంటప్పుడు కాంగ్రెసు ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే తప్పా అని అన్నారు. కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఏ విధమైన తప్పు చేయలేదని అన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వార్ వన్సైడే
ఉప ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్ సైడేనని, ఇప్పుడున్న కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఎవరూ గేలవరని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. అసెంబ్లీలో పోడియంలోకి వెళ్తే బహిష్కరించాలనే నిర్ణయానికి మొదటి బిఎఎసిలోనే సిఎల్పీ నేత జానా రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క మద్దతు తెలిపారని గుర్తు చేశారు.
అసెంబ్లీలో నిన్న జరిగిన ఘటనపై కాంగ్రెసు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే తప్పేమిటని ఆయన అడిగారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకన్న ఘటనలపై ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ, 11 మంది ఎమ్మెల్యేలన సస్పెండ్ చేస్తూ స్పీకర్ మధుసూదనాచారి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.