కర్నూలు బస్సు దుర్ఘటన.. వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తెలంగాణా ప్రభుత్వం!
కర్నూలు బస్సు ప్రమాద ఘటన పైన తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ను ప్రకటించింది. గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు సహాయం అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.
స్పందించిన తెలంగాణా ప్రభుత్వం
ఇక కర్నూలు బస్సు ప్రమాద ఘటన పైన స్పందించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయించేలాగా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కర్నూలు సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాద ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తితో సహా మొత్తం 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

మృతులను గుర్తిస్తున్న అధికారులు
మంటల్లో కాలిపోయిన బస్సు నుంచి ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీయగా ఫోరెన్సిక్ బృందాలు శవ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణకు చెందిన వారు ఇంకా ఎంతమంది ఉన్నారు అనే వివరాలు నిర్ధారించవలసి ఉంది. కర్నూలు బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన తల్లి కుమార్తె మృతి చెందినట్లు చెబుతున్నారు. మృతులను మెదక్ జిల్లా శివ్వాయి పల్లికి చెందిన తల్లి కూతుర్లు సంధ్యారాణి, చందన గా గుర్తించారు.
తెలంగాణా నుండి మృతుల వివరాల కోసం ఆరా
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కొండూరు కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న అనూష రెడ్డి కూడా మృతి చెందినట్టు నిర్ధారించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సులో సూరారం, జేఎన్టీయూ, పటాన్ చెరువు ప్రాంతాల నుంచి పలువురు ఉన్నారు. జెఎన్టియు వద్ద ఎక్కిన ముగ్గురిలో ఒకరు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు.
తెలంగాణా నుండి ఎందరు మృతి చెందారో ఇంకా తేలని లెక్క
సూరారం వద్ద ఎక్కిన గుణ సాయి అనే వ్యక్తి కిటికీ ద్వారా దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక మరో ప్రయాణికుడు ఫోన్స్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో అతను కూడా మరణించి ఉంటాడని భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు చెందిన పిలోమీ నాన్ బేబీ, కుమారుడు కిషోర్ కుమార్ ఆచూకీ కూడా తెలియడం లేదు. దీంతో వీరు కూడా మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. అయితే మొత్తం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంత మంది మృతి చెందారు అనేది పూర్తి వివరాలు తెలియలేదు. ప్రస్తుతం సంఘటన స్థలంలోనే డిఎన్ఎ పరీక్షలు, పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications