జల్సాలకు మరిగి ల్యాప్టాప్ చోరీలు: ముగ్గురి అరెస్టు
హైదరాబాద్: విలాసాల కోసం ల్యాప్టాప్లు చోరీ చేస్తున్న ముగ్గురు యువకులను హైదరాబాదులోని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లక్షలు విలువ చేసే ఆరు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఇన్స్పెక్టర్ మోహన్కుమార్, డిఐ వెంకటేశ్వర్ రెడ్డి వివరాలను వెల్లడించారు.
రాజేంద్రనగర్కు చెందిన సయ్యద్ రవూఫ్, బంజారహిల్స్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఘని చిరువ్యాపారాలు. విలాసవంతమైన కోరికలు తీర్చుకునే క్రమంలో దొంగతనాలకు ఎత్తుకున్నారు. పంజాగుట్ట, ఎస్సార్నగర్ పరిధిల్లో సంచరిస్తూ తాళం వేసిన ఉన్న హాస్టళ్లు, ఇళ్లలో చొరబడి ల్యాప్టాప్లను చోరీలు చేయడం ప్రారంభించారు.

దొంగిలించిన ల్యాప్టాప్లను యాకత్పురకు చెందిన మహ్మద్ అమీర్కు అమ్మి సొమ్ము చేసుకునే వారు. పంజాగుట్ట, ఎస్సార్నగర్ పరిధిల్లో ల్యాప్టాప్లు చోరీకి గురవుతున్నట్టు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీలలో పోలీసుల కంట పడ్డారు. పూర్తివివరాలు సేకరించేందుకు యత్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
అదుపులోనికి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించగా దొంగతనాల గుట్టును విప్పారు. సుమారు రెండు లక్షలు విలువచేసే ఆరు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకొని ముగ్గురిని రిమాండ్కు తరలించారు. కాగా మరో రెండు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, కోర్టు అనుమతితో నిందితులను కస్టడీకి తీసుకొని మరింత విచారణ చేసి వాటిని సైతం స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications