రైతు గోస.!గ్రామాలకు వెళ్దాం.!ఆదుకుందాం పదండి.!పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపు.!
హైదరాబాద్ : బుద, గురు వారాల్లో రైతు సమస్యలపై వినతి పత్రాల సమర్పణ కార్యక్రమంతో పాటు మండలాలలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలకు శ్రీకారం చుట్టిందని పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై బుద, గురువారం రెండు రోజులపాటు మండల, జిల్లా కేంద్రాలలో ప్రదర్శనలు, వినతి పత్రాలు సమర్పణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని, రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పోరాటం ఉదృతం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పులువు నిచ్చారు. ఈ విషయమై ఆయన మంగళవారం నాడు ప్రకటన చేస్తూ రేపు రాష్ట్రంలో అన్ని మండలాలలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వినతి పత్రాలు అందజేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Recommended Video
అంతే కాకుండా ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళ్ల విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. రైతులు ధాన్యం అమ్మకాల కోసం కల్లాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని, భారీ వర్షాలకు ధాన్యం పూర్తిగా పాడైందని, దీని ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో కల్లాల వద్ద రైతులు అనారోగ్యాలతో, పాముల కాటుతో మృత్యువాత పడుతున్నారని వాళ్ళను కనీసం పరామర్శించిన పాపాన పోలేదని సీఎం చంద్రశేఖర్ రావు పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సాయం కోసం రైతు కుటుంబాలు కోర్టు ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని, 67 వేల మందికి పరిహారం ఇచ్చామంటున్న సర్కారుకు 3,942 మంది భారమయ్యారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రశేఖర్ రావు పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారికంగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి.