కన్న కొడుకులతో ప్రాణహాని... దయచేసి నన్ను కాపాడండి... ఓ తల్లి ఆవేదన...
telangana news,vemulawada news,sircilla news,తెలంగాణ న్యూస్,వేములవాడ న్యూస్,సిరిసిల్ల న్యూస్
కన్న కొడుకుల నుంచే ప్రాణహాని ఉందంటూ ఓ తల్లి రోడ్డెక్కిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో చోటు చేసుకుంది. ఇన్నాళ్లు పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసి కుటుంబాన్ని పోషించిన తనను... ఇప్పుడు కొడుకులు-కోడళ్లు కలిసి ఇంటి నుంచి గెంటేశారని కన్నీటిపర్యంతమైంది.
వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం(నవంబర్ 13) ఉదయం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో ఓ మహిళ రోడ్డు పక్కన బైఠాయించింది. 'నా కన్న కొడుకుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. దయచేసి నన్ను రక్షించండి.' అని ఆమె ఓ ప్లకార్డును ప్రదర్శించింది. మరో చేతిలో మందు డబ్బాను పట్టుకుని కూర్చొన్నది. సమాచారం అందుకున్న స్థానిక సీఐ.. తెలంగాణ చౌక్కి చేరుకుని ఆమెతో మాట్లాడారు. ఆమె సమస్యపై ఆరా తీశారు.
తన పేరు సుంకపాక నర్సవ్వ అని... సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ తమ స్వగ్రామమని ఆమె వెల్లడించింది. తనకు ఇద్దరు కుమారులు శ్రీనివాస్, రాజు ఉన్నట్లు చెప్పింది. గతేడాది క్రితం వరకు తిమ్మాపూర్లోనే తాను పారిశుద్ద్య కార్మికురాలిగా పనిచేసినట్లు చెప్పింది. తన రెండో కొడుకు రాజు భార్య సంధ్యారాణికి ఆ ఉద్యోగం అప్పగించి 10 నెలలుగా తాను ఇంటి వద్దే ఉంటున్నట్లు తెలిపింది.
Recommended Video
భర్త ఎల్లయ్య ఐదేళ్ల క్రితమే చనిపోయాడని... వయసు సహకరించకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నానని చెప్పింది. అయితే కొద్దిరోజులుగా కొడుకులు,కోడళ్లు తనను భరించలేమని వేధిస్తున్నారని వాపోయింది. ఇదే క్రమంలో ఇంటి నుంచి బయటకు గెంటేశారని కన్నీళ్లు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని రోడ్డెక్కానని.. దయచేసి తనకు న్యాయం జరిగేలా చూడాలని సీఐని కోరింది. అయితే ఇలా రోడ్డుపై నిరసన తెలపడం సరికాదని... సమస్యను తాము పరిష్కరిస్తామని సీఐ హామీ ఇచ్చారు. ఆమెను ఓదార్చి ఇంటికి పంపించారు. ఆమె కొడుకులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు.