మందుబాబులకు షాక్... హైదరాబాద్లో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్...
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 19,20 తేదీల్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.ఈ రెండు రోజులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వైన్స్, బార్లు, పబ్లు మూసి ఉంటాయని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. 19వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 20న సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు ఉండవన్నారు.
వినాయక నిమజ్జనం నేపథ్యంలో నగరంలో ఆది,సోమవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం అర్థరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషేధాజ్ఞలు అమలులోకి రానున్నాయి. ఆర్టీసీ బస్సులను సైతం పలు చోట్ల దారి మళ్లించే ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర సాగే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో నగర ప్రజల కోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు పోలీసులు. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు 040-27852482, 9490598985, 9010303626 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని పోలీసులు సూచించారు. అంతేకాదు.. గూగుల్ మ్యాప్లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు.
హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనానికి మొదట హైకోర్టు అడ్డుచెప్పిన సంగతి తెలిసిందే.దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అక్కడ గ్రీన్ సిగ్నల్ లభించింది. హుస్సేన్సాగర్ సహా అన్ని చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.అయితే ఈ ఆదేశాలు ఒక్క ఏడాదికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీల్లేదని పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్సాగర్ కాలుష్యకారకంగా మారిపోయిందని, జల వనరులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిమజ్జనంపై ప్రతీ ఏటా ఎవరో ఒకరు సుప్రీంకోర్టుకు వస్తున్నారని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని పేర్కొంది.
సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.లేనిపక్షంలో నగరంలో ఏర్పాటు చేసిన వేలాది విగ్రహాల నిమజ్జనం అధికారులకు,ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారేది.నిమజ్జనానికి గడువు దగ్గరపడటంతో ఇప్పటికిప్పుడు తాత్కాలిక ఏర్పాట్లు కూడా సాధ్యపడేవి కాదు. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు బదులు మట్టి విగ్రహాన్నే ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.ఉన్నచోటే విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు అనువుగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక రేపు,ఎల్లుండి జరగబోయే నిమజ్జనానికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈసారి ట్యాంక్బండ్పై 40 క్రేన్లు ఏర్పాటు చేశారు.ఖైరతాబాద్ గణేశుడిని క్రేన్ నంబర్ 6 వద్ద నిమజ్జనం చేయనున్నారు.నిమజ్జనాన్ని వీక్షించేందుకు తరలివచ్చేవారి కోసం 565 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు.