తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు: పాత నిబంధనలతోనే మే 30 వరకు, కొత్తగా పెరిగిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు మే 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ నిబంధనలే అమలులో ఉండనున్నాయని తెలిపింది.
కాగా, లాక్డౌన్ విధించిన నాటి నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ మంత్రులతో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఆ తర్వాత మే 30 వరకు లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా తాజాగా జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
పొడిగించిన లాక్డౌన్ కాలంలోనూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపు కొనసాగుతుంది. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా మిగితావన్నీ బంద్ కానున్నాయి. మరోవైపు, కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు క్షేత్రస్థాయిలో ఉన్నందున మే 20న నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని రద్దు చేశారు.
తెలంగాణలో కొత్తగా 3982 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 71,616 నమూనాలను పరీక్షించగా 3982 మందికి కరోపా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,36,766కి చేరింది. తాజాగా, మరో 27 మంది మహమ్మారి బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 3012కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 5186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 607 మందికి కరోనా సోకింది. తెలంగాణలో ప్రస్తుతం 48,110 యాక్టివ్ కేసులున్నాయి.