కనకపు సింహాసనమున..: కేటీఆర్ ఫైర్
KTR: అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని అధిగమించిన భారత్ రాష్ట్ర సమితి.. లోక్సభ బరిపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాలను ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకుంటోంది. అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. లోక్సభ నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది. రెండు- మూడు తప్ప అన్ని లోక్సభ నియోజకవర్గాలపైనా సమీక్షలు పూర్తి చేసింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్లో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్.. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన.. అనే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన ఉందని మండిపడ్డారు. ఇంకా తాము ప్రతిపక్షంలోనే ఉన్నామనే భ్రమతో బతుకుతున్నారని, తమపై విమర్శలు చేస్తోన్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టినప్పటికీ.. నీచ మానవులు తమ వెనుకటి గుణాన్ని మార్చుకోవట్లేదంటూ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి 50 రోజులైనప్పటికీ.. ఇంకా తమపైనే ఆడిపోసుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. చేతనైతే 420 మోసపూరిత హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్-బీజేపీ ఫెవికాల్ బంధం రోజురోజుకూ బలపడుతోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రొఫెసర్ కోదండరామ్ను గవర్నర్ కోటాలో శాసన మండలికి నామినేట్ చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను తాము శాసనమండలికి నామినేట్ చేస్తే రాజకీయాలతో సంబంధం ఉందనే కారణంతో అప్పట్లో గవర్నర్ దాన్ని లిఖితపూరకంగా తిప్పిపంపించారని, ఇప్పుడు ఏకంగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరామ్ను ఎలా గవర్నర్ కోటాలో నామినేట్ చేశారని ప్రశ్నించారు.
గవర్నర్ బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంగా వ్యవహరించాల్సింది తెలంగాణ సమాజానికే తప్ప రేవంత్ రెడ్డికి కాదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజల డబ్బులతోనే రాజ్భవన్ నడుస్తోందని, అందుకే వారికే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ- కాంగ్రెస్ బంధాన్ని బట్టబయలు చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications