మాదాపూర్ రోడ్డు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. జనసేన ఎంపీ కుమారుడిపై FIR నమోదు
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ యాక్సిడెంట్ లో 26 ఏళ్ల షాపింగ్ మాల్ ఉద్యోగిని భారతి ముఖి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ ను నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. సంజూష్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సంజూష్ అతివేగంగా కారు నడిపి యువతిని ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. సంజుష్ పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 106 (1) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్-ఆర్బిట్ మాల్ లోని లైఫ్ స్టైల్ స్టోర్ లో 26 ఏళ్ల భారతి ముఖి పనిచేస్తోంది. తన తోటి ఉద్యోగి పూజా అశోక్ తో ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం వేళ ఐటీసీ కోహినూర్ వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న నేపథ్యంలో అటుగా వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ వాహనం ఢీకొట్టడంతో భారతికి తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ ఘటనపై బాధితురాలి మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే తాజా విచారణలో జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ అతివేగంగా కారు(TG-09-G-0666) నడిపి యువతిని ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో భారతి తలకు తీవ్ర గాయమై విపరీతమైన రక్తస్రావం అయింది. వెంటనే అప్రమత్తమైన సహోద్యోగులు జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి ఆమెను తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications