కేసీఆర్ అలా చెప్పడమేమిటి: భట్టి, ఒళ్లు దగ్గర పెట్టుకోండి: తలసాని
హైదరాబాద్: వర్షాల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని మధిర ఎమ్మెల్యే, తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క బుధవారం నాడు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని మీనవోలు, బనిగండ్లపాడు గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పత్తిపంటను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో నకిలీ మిర్చి విత్తనాలతో పూత, కాత లేకుండా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇప్పుడు అధిక వర్షాలతో పత్తి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం అధికారులను పంపి నష్టం అంచనా వేసి పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.
నకిలీ విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలపై, పర్యవేక్షించిన అధికారులపై, పట్టించుకోని వ్యవసాయశాఖ మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయి ఇబ్బంది పడుతుంటే, అందరూ సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ఏమిటన్నారు.
ఒళ్లు దగ్గర: తలసాని
కొత్త జిల్లాలను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకులు అఖిలపక్ష సమావేశంలో నోరెందుకు మెదపలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు.
నోరుంది కదా అని మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. వాస్తవానికి జిల్లాల స్వరూపం ఎలా ఉండాలన్న దానిపై కాంగ్రెస్ తన అభిప్రాయం చెప్పలేదన్నారు. అయినప్పటికీ తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆ దేవుడే కాపాడాలన్నారు.