భార్యతో గొడవపడి కన్న కొడుకునే బావిలో తోశాడు
మెదక్: భార్యపై కోపంతో కన్నకొడుకునే బావిలోకి తోసి హతమార్చాడో కిరాతక తండ్రి. మెదక్ జిల్లా కోహీర్ మండలం మనియార్పల్లి తండాకు చెందిన లచ్చిరాంనాయక్, మీరాబా యి దంపతులు ఆర్థిక విషయాలపై తరుచూ గొడవపడుతున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు,కొడుకు వంశీ అలియాస్ సోను(3) ఉన్నారు.
శుక్రవారంరాత్రి కూడా దంపతులు ఘర్షణపడ్డారు. మీరాబాయి కూలీపనులకు వెళ్లగా,చేపలు పడదామని పెద్దకూతురు ఆశ, వంశీని తండాశివారులోని బావి వద్దకు లచ్చిరాం తీసుకెళ్లాడు. బావిలోకి వంశీని తోసి పారిపోయాడు. ఆశ ఇచ్చిన సమాచారంతో స్థానికులు వచ్చేటప్పటికే వంశీ మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
అప్పుల బాధతో ఓ రైతు ఉరి వేసుకొని, మరో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గజ్వేల్ మండలం దాచారం, దౌల్తాబాద్ మండలం పెద్దఆరెపల్లిలలో గురువారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు కథనం మేరకు... గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన బండి మల్లయ్య(48) తనకున్న 5 ఎకరాల వ్యవసాయ పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు.
తన 5ఎకరాల పంట పొలంలో పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. అయితే ప్రస్తుత సీజన్లోనైనా చేసిన అప్పులు రూ. 5లక్షలు తీర్చుదామని భావించిన మల్లయ్యకు నిరాశే మిగిలింది. ప్రకృతి కనికరించకపోవడం, పంటల దిగుబడి అంతంత మాత్రంగానే ఉండడంతో పెట్టుబడి సైతం రాని దుస్థితి నెలకొంది. దీంతో తన భార్యతో అప్పులు తీర్చేదెలా అని పలు మార్లు ప్రస్తావించినప్పటికి ఆమె వచ్చే ఏటానైనా అప్పులు తీర్చుదామని నచ్చజెప్పింది.
ఈ క్రమంలో అప్పిచ్చిన వాళ్ల వేధింపులు అధికమవడం, మళ్లీ పంటల సాగుకు పెట్టుబడులు దొరకకపోవడంతో మార్గం కానరాక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గజ్వేల్ ఎస్ఐ జార్జి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
దౌల్తాబాద్ మండలం పెద్దఆరెపల్లికి చెందిన శేరి సుధాకర్ (28) నిరుపేద రైతు తనకున్న ఎకరం పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. అంతేగాకుండా రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లిలో మరో 3ఎకరాలు కౌలుకు తీసుకొని అక్కడ కూడా పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. అయితే పకృతి కనికరించకపోవడంతోపాటు దానికి తోడు కరెంట్ కోతలతో వేసిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రూ. 4లక్షల వరకు అప్పులు అయ్యాయి.
అప్పుచ్చిన వారి నుండి వేధింపులు అధికం కావడంతో మానసిక వేధనకు గురైన ఆయన కుటుంబ సభ్యులతో కలసి బుధవారం పెద్ద ఆరెపల్లికి చేరుకున్నాడు. గ్రామంలో సాయంత్రం వరకు అందరితో కలగోల్పుగా ఉన్న సుధాకర్ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా, అతని భార్య మమత రోదనలు అందరినీ కలచి వేసింది.