సెల్ఫోన్లో మహిళలతో అసభ్యకరంగా: వ్యక్తి అరెస్టు
హైదరాబాద్: ఫోన్లో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతున్న వ్యక్తిని హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. మహిళలకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి - విజయవాడకు చెందిన నందనాల గోపి(25) జగద్గిరిగుట్ట సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్లో నివాసం ఉన్న గోపికి ఇటీవల రోడ్డుపై ఓ సిమ్కార్డు దొరికింది.
దాన్ని ఫోన్లో వేసుకుని ఇందిరానగర్లో ఇంటి పక్కన ఉన్న ఓ మహిళ(40)కు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించాడు. రాత్రి పగలు తేడాలేకుండా ఫోన్లు చేస్తూ నరకం చూపిస్తున్నాడు. ఆమెతో పాటు అదే బస్తీలో నివాసం ఉండే మరో మహిళ నెంబర్ సంపాదించి, ఆమెను కూడా ఇదే రకంగా వేధిస్తున్నాడు. దీంతో వారం రోజుల క్రితం బాధితురాళ్లు ఇద్దరూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వాడుతున్న సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు సూరారంలో ఉన్నట్లు గుర్తించి కాపుకాసి పట్టుకున్నారు. ఈ ఇద్దరు మహిళలే కాకుండా మరో 15మందిని కూడా ఇదే విధంగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో గోపిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.