కల్తీ కల్లు దొరక్క ఉన్మాదిగా మారిన వ్యక్తి: భార్య తలను గోడకేసి కొట్టాడు
హైదరాబాద్: కల్తీ కల్లు బాధితులు ప్రవర్తన విచిత్రంగా ఉంటోంది. కల్తీ కల్లు దొరకలేదని మంగళవారంనాడు పాలమూరు జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. బుధవారంనాడు కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం రఘురాములకోటలో కల్తీ కల్లు బాధితుడు ఉన్మాదిగా మారాడు.
కల్లు దొరకడం లేదని భార్య రాధ తలను భర్త జలపతి గోడకేసి కొట్టాడు. దీంతో రాధ తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల క్రితం జరిగిన అన్న హత్య కేసులో జలపతి నిందితుడు.
మెదక్ జిల్లాలో కల్తీకల్లు దొరక్క ప్రజలు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. జిల్లాలోని జహీరాబాద్, బాగారెడ్డిపల్లె, ఆణేకుంట, రంజోల్లో 8 మంది వ్యక్తులు కల్తీ కల్లు దొరక్క వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. బాధితులను జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

గుడుంబా దొరకక మంగళవారంనాడు తెలంగాణ రాష్ట్రంలో 12 మంది మరణించారు. దీంతో అలా మరణించినవారి సంఖ్య 37కు చేరుకుంది. కల్తీ మద్యంపై, కల్తీ కల్లుపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినప్పటి నుంచి ఇటువంటి మరణాలు సంభవిస్తున్నాయి.
కల్తీ కల్లు దొరకక వ్యసనపరులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మగంళవారంనాడు 12 మరణించగా, మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా ఏడుగురు చనిపోయారు. వారిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
మెదక్ జిల్లాలో నలుగురు మరణించారు. కరీంనగర్ జిల్లాలో ఒకరు మరణించారు. వందలాది మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వివిధ జిల్లాల్లో 800 మందికిపైగా చికిత్స పొందుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ చెప్పారు
నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో పరిస్తితి అత్యంత దారుణంగా ఉంది. 200 మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications