నిత్య పెళ్లి కొడుకుపై కేసు: ఫేస్బుక్ ప్రేమ.. టెక్కీని అని చెప్పి మేస్త్రీ చీటింగ్ (ఫోటోలు)
హైదరాబాద్: అమాయక యువతులను మోసం చేసి పెళ్లి చేసుకొని కొంతకాలం తర్వాత వదిలేసి పరారవుతున్న నిత్య పెళ్లి కొడుకు పైన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని పులవర్తి గ్రామానికి చెందిన సత్యనారాయణ రాజమండ్రిలో టీచర్గా పని చేస్తున్నాడు.
భీమవరానికి చెందిన యువతి తల్లిదండ్రులను ఒప్పించి ఈ ఏడాది జూన్ 6న పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత హైదరాబాద్ వచ్చి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 17లోని ఓ ఇంట్లో పనికి కుదిరారు. అయితే తన కంటే ముందే ముగ్గురిని పెళ్లి చేసుకొని వదిలేసిన విషయం సత్యనారాయణ భార్య తెలుసుకుంది.
అతనిని నిలదీసింది. వారం రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయిన సత్యనారాయణ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఫేస్బుక్ ప్రేమ.. ఏడాది కాపురం: యువతిని మోసం చేసి పరార్
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన యువతిని పెళ్లి చేసుకొని, ఏడాది కాపురం తర్వాత ఓ యువకుడు పారిపోయాడు. దీనిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. బిటెక్ చదివి సాఫ్టువేర్ ఉద్యోగం చేస్తున్నానని నమ్మించి అతను యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెద్దలకు తెలియకుండా హైదరాబాద్ తీసుకు వచ్చాడు.
ఏడాది కాపురం తర్వాత పరారయ్యాడు. విజయవాడ సమీపంలోని వడ్డేశ్వరం ప్రాంతానికి చెందిన ఆనంద్ బాబు పదో తరగతి చదివాడు. ఖమ్మంకు చెందిన యువతికి ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. తాను బిటెక్ చదివానని, సాఫ్టువేర్ ఉద్యోగం చేస్తున్నానని యువతిని నమ్మించాడు.
ప్రేమిస్తున్నానని చెప్పడంతో, ఆమె ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వ్చింది. శ్రీకృష్ణా నగర్లో ఓ గది అద్దెకు తీసుకొని సహజీవనం చేశారు. రెండు నెలలకు గర్భం దాల్చిన ఆమెకు ఆనంద్ బాబు అబార్షన్ చాయించాడు. వీరిద్దరు మార్చి 16న నగరంలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు.
కొద్ది రోజులకే ఆనంద్ చదివింది పదో తరగతేనని, మేస్త్రీ పని చేస్తుంటాడని యువతి తెలుసుకుంది. అయినా భర్తతో కాపురం చేస్తోంది. అయితే, ఇటీవల మరోసారి గర్భం దాల్చింది. భర్త నిర్లక్ష్యం వల్ల బాబు పుట్టి చనిపోయాడు. వారం క్రితం భార్యను వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.