మృతి చెందిన 4 రోజుల తర్వాత స్వైన్ ఫ్లూ నిర్ధారణ
హైదరాబాద్: వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివనగర్కు చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. అతని మరణానికి కారణం స్వైన్ ఫ్లూనే అంటూ వైద్యులు నిర్ధారించారని, స్ధానికంగా ఉన్న వైద్యులు మంగళవారం తెలిపారు.
అతని మరణానికి స్వైన్ ఫ్లూ కారణమనే అనుమానంతో ఎంజీఎం వైద్యులు అతడి నమూనాలను సేకరించి హైదరాబాద్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వారికి పరీక్ష నిమిత్తం పంపించారు. అతడి నమూనాలను పరిశీలించిన వైద్యులు స్వైన్ ఫ్లూ కారణంగానే ఆ వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు.
దీంతో శివనగర్కు చెందిన వ్యక్తి మృతి చెందిన నాలుగు రోజుల తర్వాత స్వైన్ ఫ్లూ ద్వారానే చనిపోయినట్లు ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కాగా, ఎంజీఎంలో చికిత్స పొందుతున్న రఘునాథపల్లి మండలానికి చెందిన మరో వ్యక్తికి కూడా స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
వరంగల్ జిల్లాలో రెండు స్వైన్ఫ్లూ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.