క్యారెక్టర్పై దెబ్బేయాలనుకున్నాడు.. చివరికి కటకటాల్లో తేలాడు..
స్నేహానికి యువతి ససేమిరా అనడంతో ఆమె క్యారెక్టర్ ను దెబ్బతీయాలనుకున్నాడు. ఇందుకోసం ఆమెకు కాబోయే భర్త మెయిల్ ఐడీ సంపాదించి.. ఆ యువతి గురించి దుష్ప్రచారం చేశాడు.
హైదరాబాద్: స్నేహాన్ని ఆసరాగా చేసుకుని ఆ యువతిని బుట్టలో వేసుకోవాలనుకున్నాడు. స్నేహాం పేరుతో చేసిన వేధింపులకు యువతి లొంగకపోవడంతో ఏకంగా ఆమె క్యారెక్టర్ నే దెబ్బతీయాలనుకున్నాడు. ఇదే క్రమంలో ఆమెకు పెళ్లికి కూడా ఖాయమవడంతో.. కాబోయే భర్తకు ఆమె గురించి లేనిపోని విషయాలన్ని మెయిల్ ద్వారా చేరవేశాడు. చివరికి అసలు విషయం తేలడంతో కటకటాల పాలయ్యాడు.
రాచకొండ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన ఓ యువతి గతేడాది సెప్టెంబరులో నగరంలోని ఓ ప్రముఖ కాల్సెంటర్ సంస్థలో ఉద్యోగంలో చేరింది. బేగంపేటకు చెందిన మొఘల్ ఫిరోజ్ బేగ్(27)కూడా అదే సంస్థలో పనిచేస్తున్నాడు. ఒకే సంస్థ కావడంతో తనతో స్నేహం చేయాలంటూ యువతిని వేధించసాగాడు.
స్నేహానికి యువతి ససేమిరా అనడంతో ఆమె క్యారెక్టర్ ను దెబ్బతీయాలనుకున్నాడు. ఇందుకోసం ఆమెకు కాబోయే భర్త మెయిల్ ఐడీ సంపాదించి.. ఆ యువతి గురించి దుష్ప్రచారం చేశాడు. ఆ యువతి మంచిది కాదంటూ, ఆమెను పెళ్లి చేసుకుంటే మోసపోతావంటూ మెయిల్స్ పెట్టాడు. ఇదంతా నిజమేననుకుని నమ్మిన వరుడు పెళ్లి రద్దు చేసుకున్నాడు.
ఫిరోజ్ నిర్వాకానికి తన పెళ్లి రద్దు కావడంతో యువతి రాచకొండ సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేసింది. దీంతో గురువారం నాడు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.