ఒకరితో సహజీవనం, మరొకరితో అక్రమ సంబంధం: మహిళ హత్య
హైదరాబాద్: ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆమె ప్రాణాల మీదికి తెచ్చింది. తనతో సహజీవనం చేస్తూ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేక ఆమెను హత్య చేసిన నిందితుడిని హైదరాబాదులోని లాలాగూడ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ముదావత్ చిన్ని అలియాస్ కమలమ్మ భర్త పాండ్యా చనిపోవడంతో తనతో కలిసి కూలీ పనిచేసే వెంకటరమణారెడ్డితో సహజీవనం చేస్తోంది. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో బుధవారం రాత్రి మద్యం తాగి వెంకటరమణారెడ్డి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో మరో వ్యక్తితో కమలమ్మ ఉండటాన్ని జీర్ణించుకోలేక గొడవకు దిగాడు. అతడిపై దాడి చేయడంతో పారిపోయాడు.
వేరే వ్యక్తితో కమలమ్మ కలిసి ఉండటం తట్టుకోలేక గాఢ నిద్రలో ఉన్న ఆమెను గొంతు నులిమి, బండరాయితో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వెంకటరమణారెడ్డి పారిపోయి ముషీరాబాద్లో తెలిసిన వారి ఇంట్లో తలదాచుకున్నాడని, అతన్ని పట్టుకున్నామని ఇన్స్పెక్టర్ కరణ్కుమార్సింగ్ చెప్పారు.
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
ఇదిలావుంటే, మేనత్త పెడుతున్న వేధింపులు భరించలేక షాహిన్ ఖాన్(19) అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాదులోని ఎస్సార్ నగర్లో నివాసం ఉంటున్న ఫిరోజ్, అశ్రిన్ బేగం దంపతుల కుమార్తె షాహిన్ ఖాన్ను అబుదాబిలో ఉంటున్న మెహర్ ఉన్నీసా వద్దకు 6 నెలల క్రితం పంపించారు.
మేనత్త వేధిస్తుండడంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కొద్దిరోజుల క్రితం ఎస్ఎంఎస్ ద్వారా షాహిన్ తెలియజేసింది. తిరుగు ప్రయాణం టికెట్ పంపించాలని కోరింది. గత నెల 23న టికెట్ తీసుకుని అబుదాబికి పంపించామని ఆమె తండ్రి ఫిరోజ్ ఖాన్ తెలిపారు.
ఈ నెల 10న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని ఆయన చెప్పాడు. తన సోదరి ఆరోగ్యం బాగుండకపోవడంతో కుమార్తెను పంపించానని చెప్పాడు. మృతదేహం శుక్రవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తుందని స్థానిక పోలీసులు తెలిపారు.