ఏటీఎం పేల్చివేత..: 24గం.ల్లో ఆ పని చేయకపోతే ఆత్మహత్యే అని లేఖ..
హైదరాబాద్: సంచలనం కోసం చేయాలనుకున్నాడో.. లేక సమాజానికి తన సందేశాన్ని చెప్పాలని చేశాడో తెలియదు గానీ.. ఓ ఏటీఎంను పేల్చేసి అక్కడో లేఖ వదలి వెళ్లాడో గుర్తు తెలియని వ్యక్తి.
కేపీహెచ్బీ పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ ఫేజ్ 1లో ఓవర్సీస్ బ్యాంక్ ఏటిఎం నుంచి తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో పేలుడు శబ్దం వినిపించింది. ఏంటా అని పరిశీలిస్తే.. ఏటీఎం పేలిపోయి ఉంది.
పేలుడు పదార్ధాలు, విద్యుత్ తీగల సహాయంతో ఏటిఎం మిషన్లోని రెండు సీసీ కెమెరాలు, ఏటిఎం మిషన్ను గుర్తు తెలియని వ్యక్తి పేల్చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో నిందితుడు 17పేజీల లేఖను అక్కడ వదిలివెళ్లినట్టుగా తెలిపారు.
ప్రపంచంలో పెచ్చరిల్లుతున్న అన్యాయాలకు పరిష్కార మార్గాలు చూపిస్తూ.. ఆ వ్యక్తి అందులో కొన్ని సూచనలేవో చేశాడట. చేయడమే కాదు.. 24గంటల్లో అన్నీ మీడియా మాద్యమాల ద్వారా వాటిని ప్రచారంలోకి తీసుకురాకపోతే ఆత్మహత్య కూడా చేసుకుంటానని లేఖలో పేర్కొన్నాడట.
ప్రస్తుతం పోలీసులు అతన్ని పట్టుకునే వేటలో నిమగ్నమయ్యారు. పేల్చేసిన ఏటీఎం మిషన్ స్వల్పంగా దగ్దమైనప్పటికీ.. పెద్ద నష్టమేమి జరగలేదని పోలీసులు తెలిపారు. దీనిపై సెక్షన్ 435కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.