'ప్రైవేట్' ఫీజులు తగ్గించాలి: ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న బీసీ సంఘం నేత
హైదరాబాద్: మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన కలకలం రేగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దందాపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల ముందు విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
ఇందులో భాగంగా మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులకు నిరసనగా సంగారెడ్డి శ్రీచైతన్య స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీసీ సంఘం నేత సిరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఇది గమనించిన స్ధానికులు వెంటనే అతడిని పక్కనే ఉన్న బురదలోకి నెట్టారు. దీంతో అతడికి 20 నుంచి 30 శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. శనివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో కొంత మంది యువకులు ఈ ధర్నా చేపట్టారు.
ఈ ఆందోళనలో పాల్గొన్న సిరిబాబు ఉన్నట్టుండి ఒక్కసారిగా తనవెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో సిరిబాబుకు కాళ్ల నుంచి పొట్టపై భాగం వరకు కాలిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కలెక్టరేట్కు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం అతడిని హైదరాబాద్కు తరలించారు. వైద్యులు కూడా అతడిని హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.