NTR భవన్ లో కాసాని జ్ఞానేశ్వర్ ను కలిసిన కీలక నేత!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిశారు. నేరుగా ఎన్టీఆర్ భవన్ కు వచ్చి కాసానిని కలిశారు. మర్యాదపూర్వకంగానే కలిశానని మంద కృష్ణమాదిగ ప్రకటించారు. అయితే వీరిద్ధరి భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎస్సీ వర్గీకరణ, ప్రజల సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎమ్మార్పీఎస్ మద్దతిస్తారని, టీడీపీతో కలిసి పనిచేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడితో కూడా మంద కృష్ణకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో యాత్రలో పాల్గొని మద్దతు ప్రకటించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జోరును పెంచింది. ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించడంతోపాటు నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో బహిరంగ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో వేగం పుంజుకోవడంతోపాటు నేతలంతా ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు కూడా తెలంగాన టీడీపీ నేతలతో తరుచుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న నేతలతో తెలంగాణ టీడీపీ టచ్ లోకి వెళుతోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు పాదయాత్ర చేసేలా ప్రణాళిక రూపొందించారు. పాదయాత్ర కమిటీలు కూడా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గడప గడపకు టీడీపీ పేరుతో నాయకులంతా ఇంటింటికీ వెళ్లేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే మంద కృష్ణమాదిగ కాసానితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications