నయీం భార్య ఇంట్లో డబ్బు కుప్పలు: మిషన్లతో లెక్కించిన పోలీసులు
హైదరాబాద్/నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గ్యాంగ్ స్టర్ నయీం బాధితులు చాలామంది ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా, ఓ రాజకీయ నాయకుడు మీడియాతో మాట్లాడారు. గంగాధర్ అనే పొలిటికల్ లీడర్ మాట్లాడుతూ.. తనన కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించారని చెప్పారు.
తనకు రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ వచ్చిందని, తాను రాజకీయ నాయకుడిని కాబట్టి తాను ఫోన్ లిఫ్ట్ చేశానని చెప్పారు. నేను, నా కుటుంబం క్షేమంగా ఉండాలంటే తమ గ్రూపుకు చందాలు ఇవ్వాలని బెదిరించారని చెప్పారు. దీనిపై జూలై 16వ తేదీన డిచ్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు.
క్లూ ఇలా: నయీం ఎన్కౌంటర్లో 'బిజినెస్మెన్', భార్య ఇంటివద్ద పోలీసులు
ఆ తర్వాత మరుసటి రోజు ఫోన్ చేసి, నేను చెప్పిన దానిపై ఏం చేశావని ప్రశ్నించారన్నారు. డబ్బులివ్వకుంటే నన్ను, నా కొడుకును, నా భార్యను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని, మధ్యాహ్నం ఫోన్ చేసి కూడా రూ.కోటి ఇవ్వాలని బెదిరించారని చెప్పారు.
దీంతో తాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తే.. మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించారని అతను చెప్పారు. నయీం గ్యాంగే ఈ ఫోన్ కాల్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారన్నారు. నిజామాబాద్ జిల్లాలో నయీం గ్యాంగ్ ఉందని, వారిని అతి తొందరగా పట్టుకొని చర్యలు తీసుకోవాలని తాను పోలీసులను కోరుతున్నానని చెప్పారు.
నయీంనే కాదు అనుచరులను హతమార్చాలి: సాంబశివుడు తండ్రి
నయీంను మాత్రమే కాదని, అతని అనుచరులను కూడా పోలీసులు చంపేయాలని తెరాస నేత సాంబశివుడు తండ్రి చంద్రయ్య అన్నారు. ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారన్నారు. నయీంతో పాటు అతని అనుచరులూ హతం కావాలని కోరుకంటున్నట్లు చెప్పారు.
ట్విస్ట్: షాద్నగర్లో ఉగ్రవాదులు కాదు... నయీం హతం, ఎవరితను? (పిక్చర్స్)
ఫోర్డ్ కారు కొన్న నయీం
నయీం నాలుగేళ్ల క్రితం ఓ ఫోర్డ్ కారు కొన్నట్లుగా తెలుస్తోంది. బిరుదరాజ్ పేరుతో 2012లో కొని, 2015లో రిజిస్ట్రేషన్ చేయించాడని తెలుస్తోంది.
నోట్ల లెక్కింపు మిషన్లతో వెళ్లిన పోలీసులు
నార్సింగిలోని ఓ అపార్టుమెంటును చుట్టుముట్టిన పోలీసులు అందులో నయీం భార్య, కుటుంబ సభ్యులు ఉంటున్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది. వారి ప్లాటులో పెద్ద ఎత్తున డబ్బులు ఉండటంతో నోట్ల లెక్కింపు మెషీన్లతో పోలీసులు లోనికి వెళ్లారు. పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు మూడు గంటలుగా డబ్బులు లెక్కిస్తున్నారని సమాచారం.