Medaram jatara: శభాష్ సీతక్క... మేడారం జాతరలో ఏర్పాట్లపై భక్తుల హర్షం!!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తింది. మేడారం జాతర రేపటి నుంచి నాలుగు రోజులపాటు జరుగుతున్న క్రమంలో ఇప్పటికే లక్షలాదిమంది భక్తులు మేడారం చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న మేడారం జాతరకు సంబంధించి ఏర్పాట్లను అనునిత్యం పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్నారు.
మేడారం జాతర నేపథ్యంలో జాతర ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున ఇప్పటికే 110 కోట్ల రూపాయలను కేటాయించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని మేడారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భావించిన మంత్రి సీతక్క, మేడారంలోనే ఉండి ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

గతం కంటే భిన్నంగా ఈసారి మేడారం జాతర చాలా బాగా జరుగుతుందని ప్రజల నుండి స్పందన వస్తోందంటే సీతక్క జాతర కోసం ఎంతగా కష్టపడ్డారు అనేది అర్థం చేసుకోవచ్చు. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు గద్దెల పైకి వెళ్లి అమ్మవార్లను దగ్గరగా దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో గద్దెల పైకి వెళ్లడానికి వీలు లేకుండా తాళం వేసే వారని, అమ్మవారికి మొక్కులు, బంగారం గద్దెలపైకి విసిరి వెళ్ళవలసి వచ్చేదని, కానీ ఈసారి అందుకు భిన్నంగా సామాన్య భక్తులకు కూడా అమ్మవారి దర్శనం సునాయాసంగా దొరుకుతుందని చెబుతున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి సర్కార్ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో, మేడారం జాతరకు మహిళలంతా సంతోషంగా రాగలుగుతున్నారు అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మేడారం జాతరకు వచ్చే క్రమంలో రోడ్ల పనులు కూడా పూర్తిచేసి, ఎక్కడా రవాణా ఇబ్బంది లేకుండా చూశారని, ట్రాఫిక్ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారని , ఈ జాతర తమ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని భక్తులు చెబుతున్నారు. మంత్రి సీతక్క చొరవను కొనియాడుతున్నారు. ఆదివాసి బిడ్డ అయిన సీతక్క వనదేవతలకు చేస్తున్న సేవ గొప్పదని, అమ్మల జాతర కోసం నిద్రాహారాలు మాని సీతక్క చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడుతున్నారు. జై సీతక్క అంటూ కితాబిస్తున్నారు.












Click it and Unblock the Notifications