తలుపులు పీకేసీ.. టీవీ, సోపా సహా వస్తువులు తీస్కొని.. మున్సిపల్ అధికారుల తీరు ఇదీ..
ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం తప్పదు. కానీ కరోనా వల్ల కొందరి ఆదాయాలపై ప్రభావం పడింది. చూసీ చూడనట్టు వదిలేయడం కాదు.. కొంత సమయం ఇస్తే బాగుంటుంది. కానీ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగుడాలో మున్సిపల్ అధికారులు మాత్రం అలా చేయలేదు. వారు మోనార్క్ మాదిరిగా బిహేవ్ చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టనందుకు ఇంటి వస్తువులను తీసుకెళ్లారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
28 వేల పన్ను పెండింగ్..
అధికారులే ఇలా చేస్తే తమ పరిస్థితి ఏంటని కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొద్ది సమయం ఉండటంతో అధికారులు పన్నుల వసూలు వేటలో పడ్డారు. ఫిర్జాదిగుడాలో మురళి రెసిడెన్షియల్లో ఓ ఇంటి ఓనర్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు. సుమారు 28 వేల రూపాయల బిల్లు పెండింగ్లో ఉంది. సిబ్బందితో కలసి వచ్చిన మున్సిపల్ సిబ్బంది.. ట్యాక్స్ కట్టలేదని ఇంటి తలుపులు పీక్కెళ్లారు. పైగా ఇంట్లోని టీవీ, సోఫాసెట్తోపాటు వస్తువులను కూడా తీసుకెళ్లారు.
స్థానికులు ఫైర్
మున్సిపల్ సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఓనర్ వేరే చోట ఉంటుండగా ప్రస్తుతం ఓ కుటుంబం అందులో అద్దెకు ఉంటోంది. విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకెళతామని చెప్పినా సిబ్బంది వినలేదని వారు చెబుతున్నారు. మరోవైపు ఇంటి యజమాని ఆరేళ్ల నుంచి పన్ను కట్టలేదట.. అందుకే ఇలా చేశామని అధికారులు అంటున్నారు. 28వేల రూపాయల బిల్లు పెండింగ్లో ఉన్నా..నోటీసులు ఇచ్చినా స్పందించలేదని తెలిపారు అందుకోసమే ఇలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు..
అందులో ఉంటున్న వారే
అధికారులు బానే ఉన్నారు.. ఓనర్ బానే ఉన్నారు. కానీ అందులో ఉంటున్న వారే ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంటి తలుపు తీయడంపై విమర్శలు వస్తున్నాయి. మరీ అందులో ఉండే వారి పరిస్థితి ఏంటీ అని అడుగుతున్నారు. అంతేకాద... రెంట్ ఉంటున్న వారి వస్తువులను తీసుకోవడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. ఇదీ మంచి పద్దతి కాదు కదా అని మండిపడుతున్నారు. ఏదైనా చేసే సమయంలో ఒకసారి ఆలోచించాలని అడుగుతున్నారు.