మూడు వర్గాలు! కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పనితీరు నివేదికలు ఆమెకు అందజేశారు నేతలు. ఈ క్రమంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
మీరు నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పనితీరు ఏంటనేది తెలుసు అని మీనాక్షి నటరాజన్ అన్నారు. పని చేస్తుంది ఎవరు.. నటిస్తుంది ఎవరో తనకు తెలుసని ఘాటుగా స్పందించారు. అంతేగాక, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తన పనితీరు నచ్చకపోయినా.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు.

అంతేగాకానీ, అంతర్గత విషయాలు బయట మాట్లాడవద్దని పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. పార్టీలో కొత్త, పాత నేతల మధ్య సఖ్యతను పెంచేందుకు కేటగిరి విధానాన్ని తీసుకొచ్చారు. పార్టీలో పదవుల భర్తీ ప్రక్రియపై ఫోకస్ పెట్టిన మీనాక్షి నటరాజన్.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను మూడు కేటగిరీలుగా ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ విభజించారు. మొదట్నుంచి కాంగ్రెస్లోనే ఉన్నవాళ్లు ఒక గ్రూప్.. ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను మరో గ్రూప్.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్లను ఇంకో గ్రూపుగా విభజించారు. ఈ క్రమంలో పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications