హలో శంకర్ బాగున్నారా...-టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్కి చిరంజీవి ఫోన్ కాల్...
కరోనా వేళ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటుకు మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనూ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకు మంజూరైంది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. 'హలో శంకర్ ఎలా ఉన్నారు.. కుటుంబ సభ్యులు బాగున్నారా.. ప్రజల్లో బాగా తిరుగుతారు.. పరిస్థితులు అసలే బాగాలేవు.. ప్రజలకు బాగా ఉపయోగపడే వ్యక్తి మీరు, మీ ఆరోగ్యం జాగ్రత్త' అంటూ శంకర్ నాయక్తో చిరంజీవి సంభాషించారు.

చిరంజీవితో ఫోన్ సంభాషణ వివరాలను ఎమ్మెల్యే శంకర్ మీడియాకు వెల్లడించారు. మానుకోట తన అభిమాన కోట మీ మాట కోసం జిల్లాకు ఆక్సిజన్ బ్యాంక్ ఇచ్చానని మెగాస్టార్ చెప్పినట్లు శంకర్ నాయక్ తెలిపారు. జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకు మంజూరు చేసినందుకు గాను ప్రజల తరఫున మెగాస్టార్కు కృతజ్ఞతలు తెలియచేసినట్లు చెప్పారు.
నిజామాబాద్ జిల్లాలోనూ శనివారం(జూన్ 5) చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు సేవలు ప్రారంభమయ్యాయి.జిల్లా చిరంజీవి యువత, మున్నూరు కాపు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆక్సిజన్ సేవల నిర్వహణ సాగనుంది. కరోనా క్లిష్ట సమయంలో ప్రజలకు ప్రాణ వాయువు అందించేందుకు చిరంజీవి ముందుకు రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుతో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన చిరంజీవి.. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంకులతో ఎంతోమంది కరోనా బాధితులకు ప్రాణవాయువు అందిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి జిల్లా అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో ఈ ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం, కర్నూల్లో ఆక్సిజన్ బ్యాంకు నుంచి సిలిండర్లను పంపిణీ చేశారు. తెలంగాణలో ఖమ్మం,కరీంనగర్,మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. చిరంజీవి చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలపై హర్షం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications