సర్కార్ ముహూర్తమే బాకీ.. రెండు కారిడార్లలో మెట్రో పనులు పూర్తి : మెట్రో ఎండీ
హైదరాబాద్ : మెట్రో రైలు ఎప్పుడెప్పుడూ ప్రారంభమవుద్దా..? అని హైదరాబాద్ వాసులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ట్రాఫిక్ కష్టాల నుంచి మెట్రో రైలు ఫుల్ స్టాప్ పెడుతుందనే ఆశతో ఎదురుచూస్తోన్న నగర ప్రజలకు మెట్రో నిరీక్షణ మరింత కాలం తప్పేలా లేదు.
మెట్రోరైలు ఎండి డా.ఎన్వీఎస్రెడ్డి తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. మెట్రో రైలును ప్రవేశపెట్టబోతున్న మూడు కారిడార్లలో కలిపి ఇప్పటివరకు సుమారు 63 శాతం నిర్మాణ పనులు పనులు పూర్తి కాగా మిగతా పనులు 2017 జూలై వరకు పూర్తి చేయనున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే కారిడార్-1 (మియాపూర్-ఎస్ఆర్ నగర్), కారిడార్-3 (నాగోల్-హబ్సిగూడ) పనులు మాత్రం ఇప్పటికే పనులు పూర్తయ్యాయని, ఈ మార్గాల్లో మెట్రో పరుగులకు సర్కార్ ముహూర్తమే బాకీ ఉందని చెప్పారు మెట్రో రైలు ఎండీ డి డా.ఎన్వీఎస్రెడ్డి.
ఇకపోతే మెట్రో రైలు సర్వీసులను ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించినా గతంలో నిర్ణయించిన ఛార్జీల మేరకే మెట్రో టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మెట్రో ప్రారంభమయ్యే నాటి నుంచి ప్రతి ఏటా ఐదు శాతం ఛార్జీలు పెంచాలనే నిబంధనను ఇదివరకే ప్రభుత్వంతో కుదుర్చుకున్నట్టు తెలిపారాయన.
మెట్రో ప్రారంభమైతే పార్కింగ్ కు కష్టాలు మొదలవుతాయి కాబట్టి, దీనిపై ముందుగానే ఫోకస్ చేసిన మెట్రో అధికారులు పార్కింగ్ కోసం టెండర్లు పిలవనున్నారు. టెండర్ల ప్రక్రియ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్టు వెల్లడించిన మెట్రో ఎండీ, మెట్రో నిర్మితమవుతున్న 60 స్టేషన్లలో 50 స్టేషన్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రతి స్టేషన్లో సైకిళ్ల ఏర్పాటుపై ఫోకస్ చేస్తున్నట్టు తెలియజేశారు.
కారిడార్-3లో నాగోల్ నుంచి శిల్పారామం వరకు నిర్మిస్తున్న మెట్రో రూట్ ప్రాజెక్టు గడువు ముగిసేలోపు మూడో వంతు పనులు పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. ఇక పాతబస్తీకి సంబంధించిన మెట్రో అలైన్ మెంట్ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా.. తొలి నుంచి స్థల సేకరణ, నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో స్టేషన్ల నిర్మాణం, రైల్వే క్రాసింగ్ ల వద్ద ఆర్వోబిల నిర్మాణం వంటి పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ఆయన వివరించారు.
పెండింగ్ పనులకు సంబంధించి.. కారిడార్-1లో నిత్యం రద్దీగా ఉండే 12 జంక్షన్లలో ఒకటి మినహా మిగిలినవన్నీ పూర్తయ్యాయని చెప్పారు. అలాగే కారిడార్-2లో నాలుగు జంక్షన్ల పనులు, కారిడార్-3లో ఏడు జంక్షన్ల పనులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నట్టు తెలిపారు.
నష్ట పరిహారం..
మెట్రో ప్రాజెక్టు కింద తొలగిస్తున్న భవనాలకు సంబంధించి ఒక్కో ఫ్లాట్కు రూ. 50 లక్షల నుంచి 55లక్షల వరకు నష్టపరిహరాన్ని చెల్లించనున్నట్లు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి కోర్టు తుది తీర్పును వెల్లడించాల్సి ఉందన్నారు. కారిడార్-3లో భాగంగా సికింద్రాబాద్ లోని పద్మహంస అపార్ట్మెంట్తో పాటు మరో భవనానికి చెందిన స్థలాల్ని సేకరించాల్సి ఉందని తెలిపారు. బ్లాక్-ఏ లోని మొత్తం 24 ఫ్లాట్లు, కిందనున్న 11 షాప్ల స్థలాల్ని సేకరించనున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ-మెట్రో అనుసంధానం :
ఇక మెట్రో సేవలను ఆర్టీసీతో అనుసంధానంతో చేసే ప్రక్రియలో భాగంగా.. మెట్రో స్టేషన్లలో ఆర్టీసీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫీడర్ బస్సుల నిర్వహణకు సంబంధించి కాలుష్య రహిత వాహనాలకు పెద్ద పీట వేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.