టీఆర్ఎస్ ను ఎంఐఎం శాసించింది..! ఆ రెండు సీట్లూ సాధించింది...!!
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఎంఐఎం తలచుకుంటే ఏదైనా జరుగుతుందనే విషయం మరోసారి రుజువైంది. మైనార్టీ కార్డును ఉపయోగించి అధికార పక్షాన్ని కంట్రోల్ చేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు గులాబీని గుప్పిట పట్టి పతంగిని ఆకాశంలోకి ఎగురవేశాడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. రెండు సీట్లను త్యాగం చేస్తే ప్రతిగా మిగిలిన అన్ని సీట్లలో మద్దతు ఇచ్చేందుకు అసద్ ఇచ్చిన ఆఫర్కు గులాబీ నేతలు తలొగ్గక తప్పలేదు. ఎన్నికల వేళ ఎంఐఎంతో పంచాయితీ ఎందుకెలే అనుకుని తెరాస అధిష్టానం వెనక్కి తగ్గింది. ఇందులో స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అలసత్వానికి సీయం కేసీఆర్ చివాట్లు పెట్టినట్టు సమాచారం.
పంతం నెగ్గించుకున్న ఎంఐఎం..! రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ..!!
2014లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి తెరాస అధినేత కేసీఆర్ అటు రాష్ట్రంలో ఎంఐఎంతోనూ.. ఇటు కేంద్రంలో బీజేపీతోనూ దోస్తీ చేస్తున్నారు. రెండు పులులపై సవారీ చేస్తున్నారు. దీనిపై గతంలో `ఎఫ్బీ తెలుగు`ఇటీవల ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. ఈ సవారీలో ఎవరు ఎవర్ని మింగేస్తారోనన్న సందేహం వెలుగుచూసింది. ఎంఐఎం గుప్పిట్లోకి తెరాస వెళ్లినట్లు తెలుస్తోంది. మజ్లిస్ విషయంలో దోస్తీ బహిరంగమే అయినా బీజేపీతో దోస్తీ విషయాన్ని ఎక్కడా వెల్లడించలేదు.
నాంపల్లి, రాజేంద్రనగర్పై ఆశలు వదులుకున్న టీ.ఆర్.ఎస్...!
ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ అయితే కేసీఆర్ను శాసనసభలోనూ, బయట తెగ పొగిడేస్తూ వచ్చారు. రానున్న ఎన్నికల్లోనూ కేసీఆర్నే సీఎం చేసేందుకు తమ సహకారం అందిస్తామని చెప్పారు. కేసీఆర్ కూడా పలుమార్లు శాసనసభలో మాట్లాడేప్పుడు ఎంఐఎం తమకు మిత్రపక్షంగానే సంబోధించేవారు. తాజాగా ఎన్నికల్లో రెండు సీట్ల విషయంలో తెరాస, ఎంఐఎం మధ్య విభేదాలు తలెత్తాయి. ఇప్పటివరకు అందులో ప్రధానంగా రాజేంద్రనగర్ ఒకటి కాగా రెండోది నాంపల్లి.
ప్రతిఫలంగా గులాబీకి మద్దతుగా అసద్ ప్రచారం..! ఎంఐఎం, టీఆఎస్ ధోరణిని ఎద్దేవా చేస్తున్న ప్రతిపక్షాలు..!
ఎంఐంఎం కు గతంలో ఏడు స్థానాలు ఉండేవి. చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, యాఖుత్పురా, బహదూర్పురా, నాంపల్లి, మలక్పేటలో అభ్యర్థులు గెలిచారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఇంకో స్థానం పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కేసీఆర్ ఇచ్చిన చనువును ఆసరాగా తీసుకుని పార్టీని బలోపేతం చేసుకోవాలని ఎంఐఎం నేతలు భావించారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్పై ఆ పార్టీ కన్నేసింది. ఇక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో తమ అభ్యర్థి విజయం సాధించేందుకు అవకాశం ఉందని భావించి.. రహ్మత్బేగ్ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చింది. ఇతను అసదుద్దీన్ వద్ద గతంలో కారు డ్రైవర్గా పనిచేశారు.
ప్రకాష్ గౌడ్ ను మందలించిన కేసీఆర్..! ఎంఐఎం ను నిలువరించలేక పోయావని చివాట్లు..!!
అయితే.. అప్పటికే ఇక్కడ సిట్టింగ్ ఎం.ఎల్.ఏగా ఉన్న ప్రకాష్గౌడ్కు తెరాస టికెట్ కేటాయించింది. ఎంఐఎం బరిలో దిగితే తమ విజయావకాశాలు కష్టమని భావించిన రాజేంద్రనగర్ తెరాస నాయకులు మంత్రి కేటీఆర్ వద్ద వాపోయారు. ఈ విషయం కేసీఆర్ దృష్టికి వెళ్ళింది. ఇక్కడ ఎంఐఎంను ఎలాగైనా పోటీ నుంచి ఉపసంహరించుకునేలా చేయాలని గులాబీ నేతలు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.ఇదే అంశంలో రాజేంద్రనగర్ మాజీ ఎమ్మెల్యేను చంద్రశేఖర్ రావు మందలించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ముందస్తుగా ఎంఐఎం నేతలతో సఖ్యతగా ఉంటే ఈ సమస్య వచ్చి వుండేది కాదని కేసీఆర్ మండిపడ్డట్టు సమాచారం.