ఆ రెండు పార్టీలను నమ్ముకుంటే ఊదుకాలదు, పీరులేవదు: బీజేపీ, కాంగ్రెస్ లపై మండిపడిన ఎర్రబెల్లి
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ పార్టీలను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే: మంత్రి ఎర్రబెల్లి
కిరికిరి చేష్టలు, బోగస్ మాటలు, కల్లబొల్లి కబుర్లు చెప్పి కాంగ్రెస్ 50 ఏళ్లు దేశాన్ని పాలించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి చేసింది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలో ఉంటున్నదని బీజేపీపై ధ్వజమెత్తారు. బిజెపి, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలతో ఊదు కాలదు... పీరు లేవదు అంటూ మంత్రి మండిపడ్డారు. ఆ రెండు పార్టీలను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు

తెలంగాణలో ఏదో చేస్తామని బొంకుతున్నారు: మంత్రి ఎర్రబెల్లి
ఇక బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూట్లో రాయి తీయనోడు, ఏట్లో రాయి తీస్తాడా? అంటూ ఎద్దేవా చేశారు. వాళ్లు పాలించే రాష్ట్రాల్లో చేతగాదు కానీ, ఇక్కడ అద్భుతంగా పాలన చేస్తున్న తెలంగాణలో ఏదో చేస్తామని బొంకుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల అగ్రనేతలు ఇక్కడ మాటలు చెప్పడం కాదు. ముందుగా వాళ్ళు పాలించే రాష్ట్రాల్లో ఏదైనా చేసి చూపించమనండి అంటూ సవాల్ విసిరారు. అయినా తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని, వాళ్ళు ఏది చెబితే అది నమ్మబోరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

సీఎం కెసీఆర్ పాలనకు కితాబిచ్చిన మంత్రి
ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ పాలనకు కితాబిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తేల్చిచెప్పారు. వ్యవసాయానికి కరెంటు, నీళ్లు, ఎదురు పెట్టుబడి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి పేర్కొన్నారు. కెసిఆర్ పై ఎవరో కొందరు దుష్ప్రచారం చేస్తే నమ్మొద్దని, వాళ్లు పాలిస్తున్న రాష్ట్రాలలో పని చేసిన తర్వాత మాట్లాడాలని హితవు పలికారు. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించిన గత కూడా సీఎం కేసీఆర్ దేనని పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి. అంతేకాదు తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టనివ్వనని కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు.

రాయపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి
ఇక రాయపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కోట్లాది రూపాయల విలువైన సీసీ రోడ్లు, డ్రైనేజీ, బిటి రోడ్లు తదితర పనులకు శ్రీకారం చుట్టారు. రాయపర్తి మండలం జేతురాం తండాలో 25లక్షలు విలువ చేసే సీసీ రోడ్లు, 3 లక్షల విలువ చేసే సీసీ డ్రైనేజ్ లు, 20 లక్షలు విలువ చేసే మెటల్ రోడ్లు, 30 లక్షలు విలువ చేసే సిఆర్ ఆర్ రోడ్లు, రాయపర్తి నుండి రావుల తండా వరకు శంకుస్థాపన, 18 లక్షలు విలువ చేసే బీటీ రోడ్ నుండి జేతురాం తండా వరకు శంకుస్థాపన తదితర కార్యక్రమాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications