బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి ఎక్కడ - మంత్రి హరీష్ రావు..!!
మంత్రి హరీష్ రావు బీజేపీ పైన మరో సారి ఫైర్ అయ్యారు. డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయని విమర్శించారు. కామారెడ్డిలో మంత్రి హరీష్ పర్యటించారు. ధరణి పోర్టల్ గురించి తెలుసుకోకుండా కొంత మంది మూర్ఖులు ఏదేదో వాగుతున్నారని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ రాష్ట్రాలని బీజేపీ చెప్పుకుంటున్న రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక వైద్యారోగ్యం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. డయాలసిస్ పేషంట్ల సమస్యలు గుర్తించిన సీఎం కేసీఆర్ అందుబాటులోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
ధరణి పోర్టల్ పైన చేస్తున్న విమర్శలకు ఆయన తప్పు బట్టారు. భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్పై అడ్డగోలు మాట్లాడటం సరికాదని హరీశ్రావు పేర్కొన్నారు. రూపాయి లంచం లేకుండా పట్టా పాస్ పుస్తకాలు ఇంటికి వస్తున్నాయని చెప్పారు.ధరణితో అవినీతి తగ్గిందని... పారదర్శకత పెరిగింది. వేగవంతమైన పాలన అందుతుందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల అధికారులు కూడా ధరణి పోర్టల్ను చూసి చాలా నేర్చుకున్నారని వివరించారు. త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యలను పరిష్కారిస్తామని వెల్లడించారు.
కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేసారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 466 మండలాలను 612 కుపెంచామని వివరించారు. టీడీపీ పోయి కాంగ్రెస్ వచ్చినా నీళ్ల బాధ పోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నీళ బాధలు పోయాయని వివరించారు. అదే విధంగా మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. హర్ ఘర్ కో జల్ పేరిట దేశం మొత్తం అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మిషన్ కాకతీయ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నారని ఎద్దేవా చేసారు. రైతు బంధు కాపీ కొట్టి, కిసాన్ సమ్మన్ యోజన ద్వారా ఇస్తున్నారని మంత్రి హరీష్ చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని పేర్కొన్నారు.