పట్టపగలే దొరికిపోయి కుడితిలో పడ్డ ఎలుకలా: బీజేపీపై హరీశ్ రావు విమర్శలు
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పట్టపగలే దొరికిపోవడంతో బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు. ప్రగతిభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
బీజేపీ నేతలు ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సిట్ విచారణ ఆపాలని కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటని హరీశ్ రావు మండిపడ్డారు. ఈ కేసులో పట్టుబడినవాళ్లతో తమకు సంబంధం లేదంటున్న బీజేపీ.. కోర్టులకు ఎందుకు వెళ్తోందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కుట్రలు బట్టబయలవుతాయనే విచారణ ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ పోలీసులపై బీజేపీ నేతలకు విశ్వాసం లేదా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. బీజేపీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనించాలన్న మంత్రి.. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విచారణకు సహకరించాలని సూచించారు. గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు స్పందించారు. '' రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నవారు పద్ధతిగా మాట్లాడాలి. మేము మాట్లాడితే అంతకంటే ఎక్కువగా మాట్లాడుతాం. కానీ మేము అలా మాట్లాడం' అని అన్నారు. తుషార్ పేరు గవర్నర్ ఎందుకు ప్రస్తావించారో తెలియదన్నారు.
మరో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అనైతిక రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు సిట్ విచారణ ఆపాలనడం సిగ్గుచేటని.. ఏ సంబంధం లేకుంటే కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నారన్న మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.