ఏపీకి కేంద్రం వరం.. తెలంగాణాకు శాపం.. వివక్ష కథ చెప్పిన మంత్రి!
కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక విధంగా, తెలంగాణ రాష్ట్రాన్ని మరో విధంగా చూస్తోందా? తెలంగాణ రాష్ట్రంలో అన్ని మౌలిక వసతులు ఉన్నప్పటికీ, పారిశ్రామిక ప్రగతికి కేంద్రం తమ వంతు సాయం అందించడం లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకమైన దృష్టిని సారిస్తుందా? ఏపీకి కేంద్రం వరం తెలంగాణాకు శాపమైందా? అంటే అవును అనే చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు.
కేంద్రం తీరుపై తెలంగాణా మంత్రి శ్రీధర్ బాబు అసహనం
ఏపీలో సెమీ కండక్టర్ల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి, కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడంతో తాజాగా తెలంగాణ మంత్రులు స్పందించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణకు వచ్చే కంపెనీలకు అనుమతి ఇచ్చే విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు.

తెలంగాణా ప్రాజెక్ట్ కు అంగీకరించని కేంద్రం
ఏపీకి కొత్త ప్రాజెక్టులను కేటాయించి తెలంగాణను మాత్రం పక్కన పెడుతోందని ఆయన ఆరోపించారు.ప్రపంచ స్థాయి అధునాతన ప్యాకేజింగ్ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, దీనికోసం మహేశ్వరంలో 10ఎకరాల విలువైన భూమిని కేటాయించడంతో పాటు రాయితీలు కూడా ఇవ్వడానికి ఆమోదిస్తూ అన్ని అనుమతులను రికార్డు స్థాయిలో పూర్తి చేశామని పేర్కొన్నారు. కేంద్ర క్యాబినెట్ ప్యాకేజింగ్ కంపెనీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
10ఎకరాల స్థలం ఇచ్చినా తెలంగాణాకు నో.. ఏపీకి ఓకే
సెమీ కండక్టర్ తరహా ప్రాజెక్ట్ కోసం తెలంగాణ అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రైమ్ లోకేషన్లో 10 ఎకరాల స్థలం కేటాయించామని, ఏపీ ఒక ఎకరా కూడా కేటాయించకున్నా కేంద్రం ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి కేంద్ర విధానాలను తెలంగాణ సహించబోదని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. కేవలం కాగితాలకే పరిమితమైన వారికి ఎలా అనుమతులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
కేంద్రం రాజకీయ నిర్ణయాలు తెలంగాణ అభివృద్ధికి విఘాతాలు
కేంద్రం ఇలాంటి చర్యల వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఎటువంటి సందేశం ఇవ్వాలని అనుకుంటుందో చెప్పాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు .కేంద్రం తీసుకుంటున్న ఇటువంటి రాజకీయ నిర్ణయాలు తెలంగాణ అభివృద్ధికి విఘాతాలుగా మారుతున్నాయని, తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి పైన రాష్ట్ర ప్రభుత్వం తూర్పార పడుతుందని, కేంద్ర విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications