మహబూబ్నగర్లో ఆక్సిజన్ బ్యాంకు-మెగాస్టార్ సేవలు స్పూర్తిదాయకం-మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసలు
ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అందిస్తున్న సేవలు అభినందనీయం అని తెలంగాణ ఎక్సైజ్,క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆక్సిజన్ బ్యాంకును రాష్ట్ర ఎక్సైజ్,క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం(మే 29) ప్రారంభించారు.

ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ అభినందనీయం : శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్లో ఏర్పాటైన ఆక్సిజన్ బ్యాంకుకు మొదటి విడతగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి 10 ఆక్సిజన్ సిలిండర్లు పంపించారు. స్థానిక చిరంజీవి అభిమానులు ఈ సిలిండర్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్కు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి మెగాస్టార్గా వెలుగొందుతున్నారని... గతంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు నిలిపారని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజల కోసం ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

చిరంజీవి సేవల స్పూర్తిదాయకం
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నుంచి మరో 40 ఆక్సిజన్ సిలిండర్లు త్వరలోనే అందనున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో మరింత మంది దాతలు ముందుకు రావడానికి చిరంజీవి చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్పూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. మహబూబ్నగర్ ప్రజలకు హైదరాబాద్లోని కార్పోరేట్ ఆస్పత్రులకు ధీటుగా స్థానికంగా మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. తక్కువ ఖర్చులతోనే నాణ్యమైన వైద్యం అందుతున్నట్లు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ను కూడా ఎదుర్కొనేందుకు జిల్లాలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు
కరోనా సోకిన చాలామంది పేషెంట్లకు ఆక్సిజన్ సపోర్ట్ అవసరమవుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం వరకు దేశంలో తీవ్ర ఆక్సిజన్ కొరత నెలకొంది. ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలకు సరిపడా ఆక్సిజన్ సప్లై జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తనవంతుగా ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పటికే ఏపీలోని అనంతపురం,గుంటూరు జిల్లాల్లో,తెలంగాణలో కరీంనగర్,ఖమ్మం జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లాలోనూ ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటైంది. త్వరలోనే వీలైనన్ని జిల్లాలకు ఆక్సిజన్ బ్యాంకులను విస్తరించనున్నారు. కరోనా కష్ట కాలంలో చిరంజీవి చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications