వినాయక చవితి ఎప్పుడంటే?
హైదరాబాద్: వినాయక చవిత వేడుకలు సమీపిస్తున్న వేళ పండగ ఎప్పుడు జరుపుకోవాలనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ శోభకృత్ నామ సంవత్సరంలో వినాయక చవితి పండగను భాద్రపద శుక్ల చతుర్థి అంటే సెప్టెంబర్ 18, 2023న సోమవారం రోజున నిర్వహించుకోవాలని తెలంగాణ విద్వత్సభ సూచించింది.
సెప్టెంబర్ 18వ తేదీ నుంచే నవరాత్రులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రజలకు విద్వత్సభ సూచించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, అన్ని పీఠాలకు శాస్త్రబద్ధంగా నిర్ణయించిన పండగల జాబితాను విద్బత్సభ సమర్పిస్తూ ఉంటుంది. వినాయక చదవి పండగను సెప్టెంబర్ 18న నిర్వహించాలా? లేదా సెప్టెంబర్ 19న జరపాలా? అనే అంశంపై ప్రజల్లో సందేహాలున్న క్రమంలో ఈ మేరకు సూచన చేసింది విద్వత్సభ.

వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో 100 మంది సిద్ధాంతుల సమక్షంలో జులై 22, 23న షష్టమ వార్షిక విద్వత్సమ్మేళనంలో చర్చించి వినాయక చవితి పండగ తేదీపై నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని తాజాగా, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు ప్రకటనలో తెలిపింది. అయితే, పండగకు మరికొన్ని రోజుల సమయం ఉండటంతో వినాయక చవితి పండగ ఎప్పుడన్నది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వినాయక చవితి ఏర్పాట్లు, మండలపాల నిర్వహణఫై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో గణేశ్ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని తెలిపారు.

హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల 32,500 వరకు వినాయక మండలపాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్ 19వ తేదీన వినాయక చవితి ప్రారంభం నుంచి నిమజ్జనం జరిగేంత వరకు బందోబస్తు ఉంటుందన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసుల సాయం తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.












Click it and Unblock the Notifications