కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్
త్వరలోనే రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 1వ తేదీన కేబినెట్ భేటీలో విధివిధానాలు ఖారారు చేస్తామని చెప్పారు. త్వరలో రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రేషన్ కార్డుపై అడిగిన ప్రశ్నకు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారు. మంగళవారం పౌర సరఫరాల శాఖ పద్దులపై వాడివేడి చర్చలు జరిగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది.

కేసీఆర్ చర్యలతో రాష్ట్రంలో ధాన్యం గణనీయంగా పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. పౌరసరఫరాల శాఖ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సన్నబియ్యం టెండర్లు రద్దు చేశారా? లేదా అని ప్రశ్నలు వేశారు.
కొత్త రేషన్ కార్డులు అన్నారు, ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అడిగారు. కరీంనగర్ పర్యాటక ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి పూర్తి చేయాలని కోరారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే సాగు, తాగునీటి ఇబ్బందులు రావని గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ సమాధానమిచ్చారు.
అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశ పెట్టారు.
ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు కానుంది. యూనివర్సిటీ ద్వారా రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన దిశగా సర్కారు ముందడుగు వేసిందని మంత్రి అన్నారు. నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఆర్థిక ప్రణాళికల వ్యూహాత్మక పెట్టుబడిగా మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications