పోలీస్ స్టేషన్లోనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిరసన: మిరుదొడ్డిలో ఉద్రిక్తత
సిద్దిపేట: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. అంతేగాక, మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాగా, మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే, దుబ్బాక సీఐ కృష్ణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ, ఎస్ఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు నాలుగు గంటలపాటు స్టేషన్లోనే బైఠాయించారు. తొగుట మండలం గుడికందులలో పోలీసులు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో మెలిగారని రఘునందన్ రావు మండిపడ్డారు.
బీజేపీ శ్రేణులు స్టేషన్లోకి రాకుండా పోలీసులు గేటు మూసివేయడంతో.. స్టేషన్లోనే వంటావార్పునకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి మిరుదొడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆందోళన విరమించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావును కోరారు. అయితే, సీపీ వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మరోవైపు రఘునందన్ రావుకు వ్యతిరేకంగగా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఏసీపీ దేవారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంతకుముందు గుడికందులలో ఉద్రిక్తత: బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల తోపులాట
తొగుట మండలం గుడికందులలో మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును అడ్డుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. రఘునందన్ కారు ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను శాంతిపజేశారు.