అందుకే ఈడీ విచారణకు వచ్చా: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అంతకుముందు తనకు ఇచ్చిన నోటీసుల్లో అడిగిన వివరాల సేకరణకు మరికొంత సమయం పడుతుందని, దీని కోసం ఒక వారం గడువు ఇవ్వాలంటూ రోహిత్ రెడ్డి తన పీఏ శ్రవణ్ ద్వారా ఈడీ కార్యాలయానికి లేఖ పంపించారు.
అయితే, గడువు ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారు. దీంతో రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. దీంతో తన ఆస్తులు, కంపెనీ వివరాలు, బ్యాంక్ ఖాతాలతో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈడీ అధికారులు డిసెంబర్ 16న తనకు నోటీసులు ఇచ్చారని, ఏ కేసులో నోటీసులు ఇచ్చారో తనకు తెలియదన్నారు.

ఆ విషయం తెలుసుకోవడానికి తాను ఈడీ అధికారుల వద్దకు వచ్చినట్లు రోహిత్ రెడ్డి తెలిపారు. అయ్యప్పమాల ధరించినందున డిసెంబర్ 30 వరకు సమయం కావాలని కోరినట్లు తెలిపిన రోహిత్ రెడ్డి.. కానీ, అధికారులు అందుకు అంగీకరించలేదన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఈడీ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ కేసు నమోదు చేశారో తెలిశాక అందుకు అనుగుణంగా వివరాలు వెల్లడిస్తానని రోహిత్ రెడ్డి చెప్పారు.
కాగా, హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సహాయ సంచాలకుడు దేవేందర్ సింగ్ పేరిట గత శుక్రవారం రోహిత్ రెడ్డికి సమన్లు జారీ అయ్యాయి. రోహిత్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో ఆధార్, పాన్ కార్డ్, పాస్ పోర్టుతోపాటు తనకు, తన కుటుంబానికి చెందిన ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు, కంపెనీ వివరాలు తీసుకురావాలని కోరారు. ఆదాయపుపన్ను చెల్లింపులతోపాటు ఇతర క్రయ, విక్రయాలకు సంబంధించిన గత ఏడేళ్ల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications