నీతో తిరిగేవాళ్ళంతా నీవాళ్ళు కాదు.. పొంగులేటికి ఎమ్మెల్యే సండ్ర చురకలు
ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులను వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ గేటు తాకనివ్వనని మంగమ్మ శపథం చేయడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ఆయనపై మాటల దాడి కొనసాగిస్తున్నారు. నిన్నటికి నిన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీ మంగమ్మ శపధాలు ఇక్కడ నడవవు, పదికి పది స్థానాలు గెలిచి తీరుతామని వ్యాఖ్యలు చేయగా, తాజాగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పొంగులేటిపై విరుచుకుపడ్డారు.
పొంగులేటి వెంట తిరిగేవారు అందరూ ఉదయం పొంగులేటితో సాయంత్రం వేరే నాయకులతో తిరుగుతున్నారని, కానీ పొంగులేటికి మాత్రం వారందరూ ఎవరితో ఉంటున్నారో తెలియదని సండ్ర వెంకటవీరయ్య సెటైర్లు వేశారు. పొంగులేటితో తిరిగిన ప్రతి ఒక్కరు తనవాళ్లు కాదని, ఈ విషయం పొంగులేటి తెలుసుకోవాలంటూ చురకలాంటించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ప్రభుత్వాన్ని అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెబుతున్నావ్.. అసలు నువ్వు తెలంగాణ ప్రజల కోసం చేసిన మంచి పని ఏంటి అంటూ నిలదీశారు. చౌకబారు విమర్శలు చేసే వారిని ప్రజలు విశ్వసించరని పొంగులేటికి స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రాకముందు పొంగులేటి చరిత్ర ఏంటి? ఇప్పుడు పొంగులేటి పరిస్థితి ఏంటి అన్నది ప్రజలకు బాగా తెలుసు అన్నారు.
జిల్లాలో నువ్వేమి అభివృద్ధి చేశావని, నీకు జిల్లా ప్రజలు ఓటేస్తారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నిన్ను ప్రజలు గమనిస్తున్నారని సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో విమర్శలే ధ్యేయంగా పనిచేస్తున్న వారిని, అహంకారపూరితంగా మాట్లాడే వారిని ఓటేసి గెలిపిస్తారా చెప్పాలని ప్రజలను ప్రశ్నించారు. పొంగులేటికి రాజకీయ విధానం తెలియదన్నారు.

పార్టీ కోసం పని చేసే వాళ్ళను, ప్రజల కోసం పనిచేసే వాళ్ళను సమర్థించాలి కానీ వ్యక్తి ప్రయోజనాల కోసమే పని చేసే వారిని సమర్ధించ కూడదన్నారు సండ్ర వెంకట వీరయ్య. రెండు జాతీయ పార్టీలు నీకోసం ఎదురు చూస్తున్నాయని చెబుతున్నావ్.. వాళ్లు నీ వైపు చూడడం కాదు నువ్వే వాళ్ళ వైపు చూస్తున్నావ్ అంటూ పేర్కొన్నారు. ఇక ఆ పార్టీలు నీకు మద్దతిస్తాయా? అనేది కూడా తెలియాల్సి ఉందని, ఆ పార్టీల విధానాలు కూడా ప్రజలు గమనిస్తున్నారని సండ్ర వెంకటవీరయ్య చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications