పాల్వాయి స్రవంతిని గెలిపిస్తే సమ్మక్క సారక్కల్లా ప్రజా సమస్యల కోసం పోరాడతాం: మునుగోడులో సీతక్క
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికలు ఏవైనా ప్రచారంలో సీతక్క తనదైన పాత్రను పోషిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సైతం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని దామెర గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీతక్క ప్రత్యర్ధి పార్టీల తీరును ఎండగట్టారు.

ఓట్ల కోసం నోట్ల వర్షం కురిపిస్తున్న టీఆర్ఎస్, బీజేపీని ఓడించండి: సీతక్క
ఇక ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్న ఎమ్మెల్యే సీతక్క ఓట్ల కోసం నోట్ల వర్షం కురిపిస్తున్న బిజెపిని, టిఆర్ఎస్ పార్టీలను ఓడించాలని, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ, ప్రజల సమస్యలను పరిష్కరించలేక పోతున్నారని, గుంతలు పడిన రోడ్లను కనీసం పూడ్చలేకపోతున్నారని ఎమ్మెల్యే సీతక్క బీజేపీ, టీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును టార్గెట్ చేసిన సీతక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చేయలేకపోతున్నారని, పెట్టుబడిదారులకు రుణాలను మాఫీ చేసి బీజేపీ పెద్దలు పెట్టుబడిదారులకు అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు.

పాల్వాయి స్రవంతిని తనకు తోడుగా అసెంబ్లీకి పంపాలన్న సీతక్క
ఇక టిఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం నోట్ల రాజకీయాలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధి పై ఎలాంటి దృష్టి సారించలేదని, ఇప్పుడు కేవలం ఓట్ల కోసం కుయుక్తులు పన్నుతోందని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. పాల్వాయి స్రవంతి గెలిపించి అసెంబ్లీకి పంపితే తామిద్దరం సమ్మక్క సారక్కల్లా ప్రజా సమస్యలపై పోరాడతామని ఎమ్మెల్యే సీతక్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మునుగోడు పోరాటాల గడ్డ అని త్యాగాలకు అడ్డా అని పేర్కొన్న సీతక్క, మునుగోడు ఓటర్లు చైతన్యవంతమైన తీర్పు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు ఎమ్మెల్యే సీతక్క.

పాల్వాయి స్రవంతికి ఓటు వెయ్యాలన్న రేవంత్ రెడ్డి
ఇక మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఓటు వేసి గెలిపించాలని టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. రక్తం ధార పోసి అయినా నియోజకవర్గాన్ని పాల్వాయి స్రవంతి అభివృద్ధి చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో ఓటే లేదని అటువంటి రాజగోపాల్ రెడ్డి కి ఎందుకు ఓటు వేయాలంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్ ను మోసం చేసిన రాజగోపాల్ రెడ్డిని ఓడించాలన్న రేవంత్ రెడ్డి
నమ్మిన జెండా కోసం, పార్టీ కోసం అమ్ముడు పోకుండా నిలబడిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్న రేవంత్ రెడ్డి దామెర గ్రామ సర్పంచి యాదగిరిని, పార్టీ కోసం ఆయన పని చేస్తున్న తీరును కొనియాడారు. ఏ పార్టీ అయితే రాజగోపాల్ రెడ్డిని పోషించిందో, ఆ పార్టీని రాజగోపాల్ రెడ్డి మోసం చేసి వెళ్లాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయనను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థిని 30 వేల మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి మునుగోడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications