ఎంత అహంకారం.. రాజ్యాంగం జోలికొస్తే తీవ్ర పరిణామాలు: కేసీఆర్ కు ఎమ్మెల్యే సీతక్క వార్నింగ్!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపాయి. బడ్జెట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన కేసీఆర్, రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్ష పార్టీల నేతలు కెసిఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే బిజెపి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంటే, తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం కెసిఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన ఎమ్మెల్యే సీతక్క
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ ములుగు ఎమ్మెల్యే సీతక్క, కెసిఆర్ తాజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసీఆర్ కు సూటి ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం డా. బీఆర్. అంబేద్కర్, మహాత్మ జ్యోతి రావు పూలె , కొమరం భీం ఎంత పోరాటం చేశారని, ఎన్నో త్యాగాలు చేశారని వారి కంటే గొప్పవారా మీరు..? అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని కెసిఆర్ వ్యాఖ్యానించడం దురదృష్టకరమని ఆమె అభిప్రాయపడ్డారు.
బలహీనవర్గాలను కుక్కలు, నక్కలు అంటారా?
బడుగు బలహీన వర్గాలు, సమాజంలో ప్రతి ఒక్కరు సమాన హక్కులతో బ్రతకాలని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ గారిచే రచించబడ్డ మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తే మీరు ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని మార్చాలి అంటారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ విషయం పై మిమ్మల్ని ప్రశ్నిస్తే బలహీన వర్గాలైన మమ్మల్నికుక్కలు నక్కలుఅంటారా..? అంటూ ప్రశ్నించిన సీతక్క, రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం ఎంత అహంకారం..? అంటూ మండిపడ్డారు.
బీజేపీ ఒక్కటే రాజ్యాంగాన్నిమార్చాలని కలలు కన్నది, ఇప్పుడు మీరు తోడయ్యారా?
ఇన్ని రోజులు బీజేపీ ఒక్కటే రాజ్యాంగాన్నిమార్చాలని కలలుకన్నదని పేర్కొన్న ఆమె, ఇప్పుడు దానికి మీరు, మీ టిఆర్ఎస్ పార్టీ కూడా తోడైంది అంటూ ఎమ్మెల్యే సీతక్క అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే మీ మాటలను వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.భారత రాజ్యాంగం జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీతక్క సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు.
Recommended Video
రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే హక్కు మీకు లేదు
పాలకులు అందరూ గతంలో మాదిరిగా రాచరిక వ్యవస్థకు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క అసహనం వ్యక్తం చేశారు.అందరినీ సమానంగా చూస్తామని చేసిన ప్రతిజ్ఞ ను తెలంగాణ సీఎం కేసీఆర్ మర్చిపోయారా అంటూ ఆమె ప్రశ్నించారు. కుటుంబ వ్యవస్థ తెచ్చి సమాజంలో అసమానతలు సృష్టించేందుకు, అట్టడుగు వర్గాలను అణగదొక్కేందుకు కుట్రలు చేస్తున్నారని సీతక్క ధ్వజమెత్తారు. రాచరిక కాలం తరహాలో దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే హక్కు మీకు లేదని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే సీతక్క కేసీఆర్ కు హితవు పలికారు.