గవర్నర్కు ఫిర్యాదు: తెలంగాణను అవమానించడమేనన్న పొంగులేటి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్వవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్వవహారిస్తున్న తీరు చాలా బాధకరమని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఆంధ్రావారికి ఏదో జరిగిపోతోందన్న విధంగా ఏపీ మంత్రులు గవర్నర్కు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు.
ఇలా చేయడం వల్ల వారు తెలంగాణ గడ్డను అవమానించడమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తైన తర్వాత ప్రశాంతంగా ఉన్న తెలంగాణను అస్ధిరపర్చాలని వారు చూస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో సెటిలైనవారంతా తెలంగాణవారేనని, వారందరికి కాంగ్రెస్ పార్టీ రక్షణగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సీఎంగా కేసీఆర్ హుందాతనంగా ప్రవర్తించాలని, మాట్లాడే భాష మార్చుకోవాలని సూచించారు. ఇక తలెంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గోడ మీద పిల్లలా వ్వవహారిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచుకోవాలి: వీహెచ్
తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎంను నిలువరించాలంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకుని పెంచుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతురావు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన గాంధీభవన్ తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో మాట్లాడారు.
ఇందుకు గాను కాంగ్రెస్ నాయకులు పాతబస్తీపై దృష్టి సారించాలని అన్నారు. అధికారంలో ఎవరుంటే వారికి మద్దతుగా ఎంఐఎం ఉంటుందని వీహెచ్ మండిపడ్డారు. త్వరలో గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు.