ఏజ్ బార్ అవుతున్నా జాబ్ నోటిఫికేషన్లు మాత్రం లేవు.!మోదీ, కేసీఆర్ నిరుద్యోగులను దగా చాసారన్న వీహెచ్.!
మంచిర్యాల/హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెర చెల్క గ్రామానికి చెందిన ఇరవై ఐదేళ్ల ఆసంపల్లి మహేష్ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదనే మనస్తాపంతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం వారికి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా వి.హెచ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మారడం లేదని, ఎన్నికలకు ముందు ప్రదాని నరేంద్ర మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీ లో అనుసరిస్తున్న తీరు బాగాలేదని వి.హెచ్ అవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం ఎదురు చూస్తూ నిరుద్యోగులు అసహనంతో రగిలిపోతున్న పరిస్థితి ఉందని, పైగా నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం చూసీ చూసీ వారికి వయసు పెరిగిపోతుంది గానీ నోటిఫికేషన్ లు మాత్రం రావడం లేదని లేదని వి.హెచ్ అన్నారు. అసంపాల్లి మహేష్ లాంటి నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా భావించాలని, మహేష్ కుటుంబానికి 50 లక్షల ఆర్ధిక సహాయం అందచేయాలని, స్థానిక ఎమ్మెల్యే, బాల్క సుమన్ తగిన చొరవ తీసుకొని బాధిత కటుంబానికి న్యాయం చేయాలని సూచించారు.ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకోవాలని వి.హనుమంత రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంజీవ రావు, చెన్నూర్ నియోజక వర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనాథ్, వెంకట స్వామి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, కుమ్మరి రాజ ఇతర నాయకులు పాల్గొన్నారు.