విస్తరిస్తున్న రుతుపవనాలు: తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోకి రెండ్రోజుల క్రితమే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు నేడు, రేపు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇందుకు అనుకూలమైన వాతావరణ ఏర్పడిందని సంబంధిత అధికారులు తెలిపారు. రుతుపవనాలు మరింతగా విస్తరించనున్న క్రమంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అనేక ప్రాంతాల్లో మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, గురువారం మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
కాగా, రుతుపవనాలు ప్రవేశించడంతో సోమవారం రాత్రి మంగళవారం రాత్రి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా సింగపూర్ టౌన్షిప్ వద్ద 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు, వర్షాలు లేని ప్రాంతాల్లో మాత్రం ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో మంగళవారం అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.