గుండె తరుక్కుపోవాల్సిందే: ప్రియుడితో కలిసి కన్నబిడ్డలకు నరకం చూపించిన తల్లి..
గజ్వేల్: పసిపిల్లలన్న కనీస కనికరం కూడా లేకుండా వారికి నిత్య నరకం చూపించిన ఓ జంట ఉదంతం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో వెలుగు చూసింది. ఇరుగు పొరుగువారికి అరుపులు వినిపించకుండా.. నోట్లో గుడ్డలు కుక్కి మరీ చిన్నారులను వారు హింసించిన తీరు చూపరులను కంటతడి పెట్టించేలా చేసింది.
నాచారంలో కాపురం:
నాచారంలో ఇటీవలే సురేష్-రేణుక అనే దంపతులు ఓ ఇంట్లో అద్దెకు దిగారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండగా.. రేణుక కూలీ పనులకు వెళ్తోంది. పిల్లలను ప్రతీరోజు హింసించడం వీరికి అలవాటుగా మారిపోయింది.
ఇలా వెలుగులోకి..
నోట్లో గుడ్డలు కుక్కి వారిని చిత్రహింసలకు గురిచేస్తుండటంతో.. పొరుగువారికి కూడా ఆ విషయం తెలియలేదు. కానీ ఇటీవల చిన్నారి దివ్య.. హింసను భరించలేక గట్టిగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చి చూశారు. ఒళ్లంతా వాతలతో, శరీరంపై గిల్లిన, రక్కిన గాయాలతో, నడవలేని స్థితిలో కాళ్లు వాచిపోయి ఉన్న ఆ చిన్నారిని చూసి వారు చలించిపోయారు.
సహజీవనంలో ఇద్దరు..
ఏంటని ఆరా తీస్తే.. అప్పుడు గానీ అసలు విషయం వారికి బోధపడలేదు. నిజానికి సురేష్, రేణుక ఇద్దరు దంపతులు కాదు. వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. గజ్వేల్ సమీపంలోని జాలిగామకు చెందిన మాచ పురం సురేశ్ అలియాస్ సురేందర్ పెళ్లయిన కొన్నాళ్లకు భార్యను వదిలేశాడు.
వర్గల్ మండలం తున్కిఖాల్సకు చెందిన రేణుకకు పెళ్లై, ఇద్దరు పిల్లలు దివ్య(4), డేవిడ్(రెండేళ్లలోపు బాబు) పుట్టిన తర్వాత భర్త వదిలేశాడు. కూలీ పనుల కోసం గజ్వేల్ వెళ్లే రేణుకకు సురేష్ తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే నాచారం గ్రామంలో వీరు కాపురం పెట్టారు.
ఆ చిత్రహింసలు వర్ణనాతీతం..:
తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో.. ప్రతీరోజు చిన్నారులను కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి మరీ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. పొగ గొట్టంతో ఒళ్లంతా వాతలు పెట్టడం, ముఖంపై గోళ్లతో రక్కడం చేస్తున్నారు.
ఆఖరికి తిండి కూడా పెట్టకపోవడంతో చిన్నారులు ఇద్దరు బలహీనంగా తయారయ్యారు. ఇటీవల చిన్నారి దివ్య అరుపులతో చుట్టుపక్కలవాళ్లు ఇంట్లోకి రాబట్టి ఈ విషయం వెలుగుచూసింది. చిన్నారుల పరిస్థితిని చూసి వారు చలించిపోయారు. ఆకలితో అలమటిస్తున్న ఇద్దరు చిన్నారులకు ముందు అన్నం పెట్టి ఆపై చికిత్స కోసం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీసులు సురేష్, రేణుకలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారుల సంరక్షణ కోసం చిల్డ్రన్ హోమ్కు తర లించనున్నట్లు తెలిపారు.