ఏసీబీ వలలో అవినీతి ఎంపీడీవో: రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకుడిగా (ఫీల్డ్ అసిస్టెంట్) నియమించడానికి రూ.30 వేలు లంచం అడిగిన ఎంపీడీవో.. వరంగల్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికేశారు.
వరంగల్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకుడిగా (ఫీల్డ్ అసిస్టెంట్) నియమించడానికి రూ.30 వేలు లంచం అడిగిన ఎంపీడీవో.. వరంగల్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికేశారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలంలో ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న సీనియర్ మేట్ చెల్లమల్ల వీరన్న.. ఇటీవల ఖాళీ అయిన క్షేత్ర సహాయకుడి పదవి కోసం దరఖాస్తు చేశారు.
ఆ ఉద్యోగం కావాలంటే రూ.30 వేలు ఇవ్వాలని ఎంపీడీవో తాళ్ల ఉపేందర్ డిమాండ్ చేశారు. 22న ఒక దఫాలో రూ.5వేలు ఇచ్చిన వీరన్న.. వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వాళ్ల సూచనలతో మంగళవారం ఎంపీడీవోకు రూ.25వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు.
కాగా, కౌసల్యదేవిపల్లికి చెందిన గౌస్ అనే వ్యక్తి ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరు కోసం తన వద్ద నుంచి ఎంపీడీవో రూ.45 వేలు తీసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. బీరిశెట్టిగూడెంకు చెందిన 15మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల లబ్ధిదారుల నుంచి రూ.1.60లక్షలు, ముంగిమడుగు శివారు పక్కీర తండాకు చెందిన గుగులోతు కిషన్ నుంచి రూ.1.80లక్షలు లంచం ఉపేందర్ తీసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఎంపీడీవోపై కేసు నమోదు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు.