మెట్రో ముహూర్తం ఓకే: అన్నింటా హైదరాబాద్ మెట్రోనే టాప్!
హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల ప్రారంభానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ మెట్రో సర్వీసుల ప్రారంభానికి టైం కేటాయించారని అనధికార వార్తా కథనాల వల్ల తెలుస్తున్నది.
హైదరాబాద్: మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మియాపూర్ నుంచే మెట్రో రైలును ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రూట్మ్యా్ప్ను రాష్ట్ర పోలీసుశాఖ ఖరారు చేసినట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఈనెల 28వ తేదీన విమానంలో బేగంపేటకు చేరుకుని.. అక్కడి నుంచి మియాపూర్కు చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల ప్రాంతంలో మెట్రో స్టేషన్ను ప్రారంభించనున్నారు. అక్కడే మెట్రో పైలాన్ను ప్రారంభిస్తారు. మియాపూర్లో పచ్చజెండా ఊపిన తర్వాత అదే రైలులో ప్రధాని మోదీ 13 కిలో మీటర్ల దూరంలో ఉండే అమీర్పేట వరకు ప్రయాణించనున్నారు. అమీర్పేట ఇంటర్చేంజ్ స్టేషన్ను కొన్ని నిమిషాలపాటు పరిశీలించిన తర్వాత అదే మార్గంలో తిరిగి మియాపూర్ చేరుకునేలా మెట్రో అధికారులు రూట్ మ్యాప్ సిద్దం చేశారు. ఈ ప్రయాణ సమయంలోనే 'హైదరాబాద్ మెట్రో' విశేషాలను అధికారులు ఆయనకు వివరిస్తారు.
Recommended Video
హైదరాబాద్ మెట్రో రైలులో పర్యటించిన తర్వాతే మియాపూర్లో జరిగే సభలో ప్రసంగించిన తర్వాత మోదీ మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగే సదస్సుకు వెళతారు. ఈ మేరకు పోలీసు అధికారులు శుక్రవారం హెలీప్యాడ్ స్థలాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఎయిర్ఫోర్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ట్రాఫిక్, మెట్రో, ఎల్అండ్టీ అధికార యంత్రాంగం పలుమార్లు మియాపూర్ స్టేషన్, మెట్రో కారిడార్ ప్రాంతాన్ని సందర్శించి, ఓకే చేశాయి. మెట్రో రైలు ప్రయాణాన్ని భాగ్యనగర వాసులకు 28వ తేదీ నుంచే అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ప్రధాని మోదీ ప్రారభించి వెళ్లిన రెండుగంటల తర్వాత ప్రజలకు మెట్రో రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తేనున్నారు. 30 కిలో మీటర్ల మార్గం సిద్ధమవుతుండడంతో రైళ్లు నడిపేందుకు అన్ని పనులు పూర్తి చేస్తున్నారు.
30 కిలోమీటర్ల మార్గంలో ఆపరేషన్స్ రికార్డే మరి
ఈ నెల 28వ తేదీన భాగ్యనగర వాసులకు సేవలందించేందుకు సిద్ధమవుతున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు.. దేశంలోని ఇతర మెట్రో రైలు ప్రాజెక్టుల రికార్డులను తిరగ రాయనున్నది. ఎకాఎకీన 30 రైల్వేస్టేషన్ల పరిధిలో సర్వీసుల నిర్వహణ ద్వారా ఆ రికార్డు నెలకొల్పనున్నది. ఇప్పటివరకు కేరళలోని కోచి నగరంలోని మెట్రో రైలులో ఆరు నెలల క్రితం అత్యధికంగా 11 స్టేషన్ల పరిధిలో 13.4 కిలోమీటర్ల పొడవున తొలుత సర్వీసులు ప్రారంభించిన రికార్డు నమోదైంది. నాగోల్-మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల మేర ఆపరేషన్స్ మొదలుపెట్టి దేశంలోనే అతిపెద్ద మార్గంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించిన మెట్రోగా రికార్డు సొంతం చేసుకోనున్నది.
ఆయన ఆదేశాల మేరకే 30 కిలోమీటర్ల మార్గం ఇలా సిద్ధం
నాగోల్ - మెట్టుగూడ మధ్య ఎనిమిది కిలోమీటర్లు, మియాపూర్ - ఎస్సార్ నగర్ మధ్య పది కిలోమీటర్ల మార్గం గతంలోనే పూర్తయినా కమర్షియల్ ఆపరేషన్స్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. ‘తుకుడ.. తుకుడలతో ఏం లాభం.. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు ఎవరెక్కుతరు.. కనీసం ఎల్బీనగర్కు సికింద్రాబాద్కు లింకులేదు.. మధ్యలెక్కి మధ్యల ఎవరు దిగుతరు. వీలైనంత ఎక్కువదూరం రైళ్లను నడుపండి.. లేటైనా ఫర్వాలేదు అని సీఎం కేసీఆర్ అప్పట్లో ఆదేశించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో అధికారులు మెట్టుగూడ-ఎస్సార్నగర్ మధ్య మెట్రో మార్గాన్ని పూర్తిచేసి నాగోల్-మియాపూర్ 30 కి.మీల మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. కోల్కతాలో 1984 మొదటి మెట్రోరైలు ప్రారంభం కాగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తొమ్మిది మెట్రోలు నడుస్తున్నాయి. మనది పదో మెట్రోగా రికార్డుల్లో చేరబోతున్నది.
దేశ రాజధాని ‘హస్తిన' పరిధిలో 8 కిమీతో మెట్రో సర్వీసులు
దేశంలోనే మెట్రో రైలు ప్రాజెక్టు పనులు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో చేపట్టారు. దేశంలోనే ఇది తొలి మెట్రో ప్రాజెక్టు. మెట్రో కమర్షియల్ ఆపరేషన్స్ను 1984లో ప్రారంభించారు. నౌపర - కావి సుభాష్ మధ్య మూడు కిలోమీటర్ల మార్గంలో ఆపరేషన్లు మొదలయ్యాయి. ప్రసుత్తం కోల్కతాలో 27.22 కిలోమీర్ల మార్గంలో 27 రైళ్లను నడిపిస్తున్నారు. ఇందులో 17 కిలోమీటర్లు భూగర్భ మార్గం, 10 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గాన్ని నిర్మించారు. రోజూ 6.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇక భారత దేశానికి ఆధునిక మెట్రోలకు మార్గనిర్దేశనం చేసింది ఢిల్లీ మెట్రో. ఢిల్లీలో 2002 డిసెంబర్ 24 వ తేదీన ప్రారంభించారు. మొదట దిల్షాద్గార్డెన్స్-రితాలా మధ్య 8 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. తర్వాత 218 కి.మీలకు విస్తరించారు. ప్రస్తుతం 314 రైళ్లు 164 స్టేషన్లతో ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. రోజూ 27.6 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
దక్షిణాదిన చెన్నైలో 2015లో మొదటి మెట్రో సర్వీసు మొదలు
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో 2014 జూన్ 8వ తేదీన వెర్సోవా - అంధేరి - ఘట్కోపర్ మధ్య 11 కిలోమీటర్ల మార్గంలో మొదటి మెట్రో సర్వీసు పరుగులు తీసింది. ప్రాజెక్టులో మొత్తం 216 కి.మీలు 11 కారిడార్లను ప్రతిపాదించగా, ప్రసుత్తం ఒకేలైన్లో ఆపరేషన్స్ నడుస్తున్నాయి. మరో మూడు కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయి. రోజూ 3.6 లక్షల మంది మెట్రో సర్వీసులను వినియోగించుకుంటున్నారు. దక్షిణాది భారత దేశంలో తొలుత మెట్రో రైలు సర్వీసులు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో ప్రారంభమయ్యాయి. 2015లో తొలుత కోయంబేడు - ఆలందూరు మధ్య 10 కి.మీల మేర ప్రారంభం కాగా, 27.88 కి.మీలకు విస్తరించారు. 20 స్టేషన్ల మధ్య 42 రైళ్లు నడుస్తున్నాయి. బోగీలను ఏపీలో తయారుచేయడం విశేషం. మరో 26 కి.మీల మార్గం నిర్మాణంలో ఉన్నది.
మెట్రో ఢిల్లీతో మెట్రో గుర్గావ్ ఇలా లింకప్..
నమ్మమెట్రో పేరుతో 2011లో బెంగళూరు మెట్రో సర్వీసులను ఏడు కిలోమీటర్లతో ప్రారంభించారు. బియ్యప్పనహళ్లి - మహాత్మాగాంధీ రోడ్ మధ్య తొలిమెట్రో తిరిగింది. తర్వాత 42.3 కిలోమీటర్ల పొడవున గల మార్గంలో 41 స్టేషన్లకు విస్తరించారు. 33.48 కిలోమీటర్లు ఎలివేటెడ్, 8.82 కిలోమీటర్ల భూగర్భ మార్గాన్ని వేశారు. రోజూ నాలుగు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీకి శివారుల్లో గుర్గావ్ నగరం ఉన్నది. గుర్గావ్ నగరాన్ని ఢిల్లీ మెట్రోతో గుర్గావ్ పట్టణాన్ని అనుసంధానం చేయడానికి వీలుగా గుర్గావ్ మెట్రో 11.7 కి.మీలతో మెట్రో ప్రాజెక్టును ప్రతిపాదించారు. 2013లో 5 కి.మీల మేర సికిందర్పూర్- ఢిల్లీమెట్రో ఎల్లోలైన్ మధ్య మొదటిదశ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మార్చిలో మరో 6.7 కి.మీల మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు మొత్తం ప్రైవేట్ నిధులతో చేపట్టి ప్రపంచ రికార్డును సాధించింది. ఇది పూర్తిగా ఎలివేటెడ్ మెట్రో. రోజూ 35 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
జల, రోడ్డు రవాణాతో కోచి మెట్రో అనుసంధానం ఇలా
భారత దేశానికే పింక్ సిటీగా రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరానికి పేరు. 10 కిలోమీటర్ల మార్గంలో జైపూర్లో 2015 జూన్ 3వ తేదీన మానసరోవర్ - చాంద్పోల్ మధ్య (10 కిలోమీటర్లు) మొదటి మెట్రో రైలు తిరిగింది. తొమ్మిది రైల్వే స్టేషన్ల మధ్య రోజూ 19 వేల మంది రాకపోకలు సాగిస్తున్నాయి. మరో 23 కిలోమీటర్ల మార్గం విస్తరించాలని ప్లాన్ వేస్తున్నారు. కింద రోడ్డు, మధ్యలో ఎలిటెడ్ ఫ్లై ఓవర్, ఆపైన మెట్రోకారిడార్ కలిగి ఉండడం జైపూర్ మెట్రో ప్రత్యేకత. ఇక కేరళలోని కోచి నగర పరిధిలో ఈ ఏడాది జూన్ 17వ తేదీన 13 కిలోమీటర్ల మార్గంలో మహారాజాస్ కాలేజీ స్టేడియం-పాలారివట్టం మధ్య మెట్రో రైలు సర్వీసు ప్రారంభమైంది. మరో కారిడార్ నిర్మాణదశలో, ఇంకో కారిడార్ ప్రణాళిక దశలో ఉన్నది. నాలుగేండ్లలో నిర్మాణం పూర్తి చేసి ఒకరికార్డు సాధించగా, 13.కి.మీల ఆపరేషన్స్తో మరో రికార్డును సాధించింది. రోడ్డు, జల, రైలుమార్గాలను అనుసంధానిస్తూ నిర్మించిన మెట్రో ఇదే కావడం గమనార్హం. మెట్రోకు అనుసంధానిస్తూ వ్యట్టిన-కక్కనాడ్ మధ్య బోటును ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగర పరిధిలో ఎనిమిది కిలోమీటర్ల మార్గంలో ఈ ఏడాది సెప్టెంబర్ ఐదో తేదీన ట్రాన్స్పోర్ట్నగర్ - చార్బాగ్రైల్వే స్టేషన్ల (8 కి.మీ) మధ్య నడుపుతున్నారు. మరో 27 కి.మీల మార్గం నిర్మాణదశలో ఉన్నది.